బంగారు కాదు, తాగుబోతు తెలంగాణ చేస్తున్నారు: కెసిఆర్పై రేవంత్ ఫైర్
మహబూబ్నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చీప్ లిక్కర్ అమ్మకాలతో ఊరికో బెల్టు షాపు, ఇంటికో తాగుబోతును తయారు చేసే పనిలో సిఎం అడుగులు వేస్తున్నారని విమర్వించారు. శనివారం ఆయన కొడంగల్లో మీడియాతో మాట్లాడారు.
లిక్కర్ అమ్మకాలతో గీతకార్మికుల జీవనోపాధికి ప్రమాదం వాటిల్లనుందని అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తామని గొప్పలు చెబుతున్న కెసిఆర్, ఇంటికో తాగుబోతును తయారు చేసి తాగుబోతు తెలంగాణగా మార్చను న్నారని ఆరోపించారు.
గీత కార్మికులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడం ఓర్వలేక వారిని అణగదొక్కేందుకు లిక్కర్ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఈ లిక్కర్ను ఉత్తరప్రదేశ్, బీహర్ మాఫియా ద్వారా రాష్ట్రానికి తరలించడంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయని ఆయన ఆరోపించారు.
గ్రామాల్లో బెల్టు షాప్లను కొనసాగిస్తున్న లిక్కర్ మాఫియా ప్రజలను గుప్పిట్లో లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటికైనా గీతకార్మికులు మేల్కొని ఉద్యమాలను ఉధృతం చేయాలని, అందుకు టిడిపి సంపూర్ణ మద్దతును ఇస్తుందని ఆయన చెప్పారు. టిడిపి గీతకార్మికుల తరపున దశల వారీ ఉద్యమలు చేపట్టేందుకు కార్యచరణను తయారు రూపొందిస్తోందని చెప్పారు.
జిల్లాకో దొరను ఎంపిక చేసి ప్రజలను మోసగించే కార్యక్రమాలను సిఎం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పాలమూర్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తూ ఆత్మగౌరవం లేనివిధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి జూపల్లి తన గన్మెన్లను నక్సలైట్లకు పట్టించి నిర్ధాక్షిణ్యంగా చంపించారని ఆరోపించారు.