మందు బాటిల్ కాదు, మళ్లీ తుపాకీ పడతా: రేవంత్
కరీంనగర్: తమ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు అవసరమైతే మళ్లీ తుపాకీ పడతానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టిడిపి కార్యకర్తలను కాపాడుకునేందుకు మరోసారి తుపాకీ పడతానని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ ఖాళీ చేయడానికి అదేం కెసిఆర్ ఫాంహౌజ్లో మందు బాటిల్ కాదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2009 ఎన్నికల్లో తాము మద్దతు ఇచ్చి కేటీఆర్ను గెలిపించామని, అలాంటి టీడీపీని ఖాళీ చేస్తామనడం సరైంది కాదని హితవు పలికారు.

ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు టీడీపీ నేతలను కుక్కలుగా అభివర్ణిస్తున్నారని, ప్రజల కోసం పోరాడేందుకు శునక విశ్వాసాన్ని చూపిస్తామని రేవంత్ అన్నారు. తెలంగాణ మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారారని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.
టిడిపి నేతలను కుక్కలతో పోల్చడంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 2011లో కరీంనగర్లో జరిగిన రణభేరి సభకు రేవంత్ రెడ్డి తుపాకీ వెంటబటెట్టుకుని వెళ్లడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉస్మానియా విద్యార్థులపై తుపాకీ గురిపెట్టాడనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి.












Click it and Unblock the Notifications