చాపర్ ప్రచారానికి రేవంత్ రెడ్డికి పచ్చజెండా, 'డిసెంబర్ 11 తర్వాత హరీష్ రావు హస్తగతం'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి చాపర్ ద్వారా ప్రచారం చేసుకునేందుకు తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ అనుమతి లభించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి చాపర్ ప్రచారం నేపథ్యంలో ఇందుకోసం హెలిప్యాడ్లు సిద్ధం చేయాలని సూచించారు.
నవంబర్ 25వ తేదీన అసీఫాబాద్ నుంచి అతని చాపర్ ప్రచారం ప్రారంభం కానుంది. అక్టోబర్ 2వ తేదీన ఎల్బీ నగర్లో ముగుస్తుంది. వారం రోజుల పాటు ఈ ప్రచారం నిర్వహించనున్నారు. రేవంత్ రెడ్డి ఈ వారం రోజుల్లో అదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలోని పలు ప్రాంతాల్లో 28 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
ఆర్థిక నేరగాడిని వదలం: కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, హెచ్చరికలు
ఫలితాల తర్వాత టీఆర్ఎస్ హరీష్ రావు హస్తగతం
కాగా, రేవంత్ రెడ్డి తన ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ మంత్రి కేటీ రామారావులు మంత్రి హరీష్ రావు ట్రాప్లో పడ్డారని రేవంత్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. డిసెంబర్ 11వ తేదీన ఫలితాలు వచ్చాక టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు హస్తగతం అవుతుందని జోస్యం చెప్పారు.
హరీష్ రావు కోరిక అదీ
శనివారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలోను ఆయన మాట్లాడారు. తమకు పంచ్లు వేయడంతో పాటు పాలించడం కూడా వచ్చునని చెప్పారు. కేసీఆర్ రాచరికం రుచి చూపించారని ఎద్దేవా చేశారు. తమది నక్సలైట్ల అజెండా అని కేసీఆర్ చెబుతుంటారని, మరి కుటుంబ పాలన ఏ నక్సలైట్ల అజెండానో చెప్పాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం తెలంగాణ ప్రజలది కాదని, రాజకీయ మనుగడ కోసం కేసీఆర్ ఇచ్చిన నినాదం అన్నారు. ఎన్నికల్లో తెరాస ఓడిపోయి కేసీఆర్ ఫామ్హౌస్కు, కేటీఆర్ అమెరికాకు పోవాలని హరీశ్రావు కోరుకుంటున్నారని చెప్పారు.
నా కూతురు నిశ్చితార్థానికి వెళ్లకుండా చేసినప్పుడు నేను ఏమనుకోవాలి
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని అమ్మనా, బొమ్మనా అని కేటీఆర్ విమర్శించడం బరితెగింపు కాదా అని రేవంత్ అన్నారు. ప్రతి అంశంలో సీఎం మనవడిని రోల్ మోడల్గా చూపిస్తుంటే తాము ప్రస్తావించామని చెప్పారు. ఈ మాత్రానికే రాజకీయాల నుంచి విరమించుకోవాలన్నంత దుఃఖమొచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారని, తన కూతురి నిశ్చితార్థానికి వెళ్లకుండా కుట్ర చేసినపుడు నేను ఏమనుకోవాలన్నారు.
అందుకే సచివాలయానికి రావట్లేదు
ఉమ్మడి ఏపీని పాలించిన పదహారు మంతి ముఖ్యమంత్రుల్లో వారి కుమారులు ఎవరూ సీఎం కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు మాత్రమే సీఎం ఏయ్యారని చెప్పారు. ఆ సచివాలయం నుంచి పాలిస్తే కొడుకు కేటీఆర్కు బదులు అల్లుడు హరీష్ రావే సీఎం అవుతారని ఎవరో జ్యోతిష్యుడు కేసీఆర్కు చెప్పాడట, అందుకే సీఎం సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్ నుంచి పాలిస్తున్నారని ఎద్దేవా చేశారు.