రేవంత్తో పాటు 25మంది: ఎవరెవరు?, ఎప్పుడు?.. పక్కా ప్లాన్ తోనే ఇదంతా..
Recommended Video

హైదరాబాద్: టీటీడీపీలో రేవంత్ రెడ్డి పెట్టిన చిచ్చు ఎక్కడికో దారితీస్తుందో అంతుపట్టడం లేదు. రేవంత్ వర్గం కాంగ్రెస్ వైపు.. మరికొంతమంది టీఆర్ఎస్ వైపు వెళ్తుండటంతో.. తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ మార్పు అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఓవైపు కాంగ్రెస్ గూటికి వెళ్తున్నట్లు సంకేతాలిస్తూనే.. మరోవైపు టీటీడీపీ వర్కింగ్ కమిటీ భేటీకి హాజరయ్యారు. అంతేకాదు, అక్టోబర్ 26న టీడీఎల్పీ సమావేశం ఉంటుందని కూడా ప్రకటించారు. దీంతో రేవంత్ పార్టీతో చెడుగుడు ఆడుకుంటున్నాడని సీనియర్లు వాపోతున్నారు.

పార్టీ ఇమేజ్ పూర్తిగా దెబ్బతినేలా:
రేవంత్ అసలు పార్టీలోనే కొనసాగుతారా? లేక కాంగ్రెస్ లోకి వెళ్తారా అన్నది సీనియర్లకు అంతుపట్టడం లేదు. ఓవైపు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉంటూనే.. మరోవైపు టీడీఎల్పీ సమావేశాన్ని ప్రకటించడం వారికి మింగుడుపడటం లేదు. రేవంత్ తన ఇష్టారీతిన వ్యవహరిస్తూ అంతో ఇంతో మిగిలి ఉన్న పార్టీ ఇమేజ్ను పూర్తిగా దెబ్బతీస్తున్నారని బాధపడుతున్నారు.

పక్కా ప్లాన్.. 25మందితో
టీటీడీపీ సమావేశాలకు హాజరవుతూనే.. కాంగ్రెస్లో చేరికకు సంబంధించి రేవంత్ అన్ని అడ్డంకుల్ని క్లియర్ చేసుకుంటున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్లో తనకు ప్రాధాన్యం తగ్గకుండా ఉండాలంటే.. తనకంటూ అనుకూల వర్గాన్ని క్రియేట్ చేసుకోవాలని రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు. తద్వారా భవిష్యత్తులో పార్టీ పెద్దలను ఎదిరించడానికి కూడా తనకు ఆస్కారం ఉంటుందని రేవంత్ ఆలోచిస్తుండవచ్చు.
అందుకే తనతో పాటు మరో 25మంది పార్టీలోకి వస్తారని, వారందరికీ టికెట్ ఇవ్వాలని ఆయన రాహుల్తో చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం దీనికి ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇందులో నిజమెంతనేది చెప్పలేని పరిస్థితి.

ఆ బాధ్యత ఇస్తారా?
పార్టీలో రేవంత్ కు అంత ప్రాధాన్యం ఇవ్వవద్దని కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వచ్చే ఎన్నికల్లో రేవంత్ కు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉత్తమ్, జానారెడ్డి, మల్లుభట్టి విక్రమార్క లాంటి సీనియర్లకు రేవంత్ చేరిక గురించి ముందే తెలుసంటూ ప్రచారం కూడా జరుగుతోంది.

ఎప్పుడు, ఎవరెవరు?:
నవంబర్ 9వ తేదీన కాంగ్రెస్ లో చేరేందుకు రేవంత్ అంతా సిద్దం చేసుకున్నారని చెబుతున్నారు. చేరిక తర్వాత మహబూబ్ నగర్ లేదా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రేవంత్ ను ఆహ్వానించాలనే యోచనలో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది.
వరంగల్ టీడీపీ నేతలు సీతక్క, వేం నరేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరెడ్డిలను కూడా రేవంత్ తనతో పాటు కాంగ్రెస్ లోకి తీసుకెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే పెద్దపల్లికి చెందిన విజయరమణారావు, కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి,నిజామాబాద్ నుంచి అన్న పూర్ణమ్మ కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారని సమాచారం.రేవూరి ప్రకాశ్రెడ్డి పేరు కూడా తొలుత ఈ జాబితాలో వినిపించినప్పటికీ.. ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications