స్పీకర్కు మరో దారిలేదు, కెసిఆర్కు సవాల్: హైకోర్టు తీర్పుపై రేవంత్
హైదరాబాద్: హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన 12మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం తప్ప తెలంగాణ స్పీకర్కు మరో దారిలేదని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మూడు నెలల్లోగా టిఆర్ఎస్లో చేరిన 12మంది టిడిపి ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే తమ విన్నపాన్ని పెడచెవిన పెట్టడం వల్లే తాము న్యాయస్థానం తలుపు తట్టడం జరిగిందని చెప్పారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో శాసనసభ కార్యాలయానికి కనువిప్పుకలగాలని అన్నారు. 90రోజుల్లోగా నిర్ణయం తీసుకుని, వేటు వేయాలని స్పీకర్ను హైకోర్టు ఆదేశించడం శుభపరిణామం అని రేవంత్ అన్నారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన టిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్.. వారిని తన బంజేరుదొడ్డిలో కట్టేసుకున్నారని ఎద్దేవా చేశారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం పాలక పక్షం ఇలాంటి చర్యలకు దిగడం సరికాదన్నారు.
కొందరు అధికారులు స్పీకర్ కార్యాలయాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. రిటైరైన అధికారులను కార్యాలయాల్లో కొనసాగిస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఉన్నత అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో మున్సిపల్ కమిషనర్ సోమేష్ను స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకున్న ప్రభుత్వం.. ఆ తర్వాత అతడ్ని బలిచేసిందని ఆరోపించారు.
ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డిని కూడా అలాగే ఉపయోగించుకుని బలిచ్చారని.. ఈ ఘటనలు ఇతర అధికారులకు కనువిప్పు కలిగించాలని రేవంత్ అన్నారు.
పార్టీ ఫిరాయింపులపై కెసిఆర్ క్షమాపణ చెప్పి, 12మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా చూడాలన్నారు. అంతేగాక, నీతినిజాయితీ ఉంటే వెంటనే ఉప ఎన్నికలకు దిగాలని కెసిఆర్కు సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఛీకొట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దని అన్నారు.
అన్ని పార్టీలు కలిసే స్పీకర్ను ఎన్నుకున్నాయని, అలాంటప్పుడు స్పీకర్ అందరు సభ్యులను సమానంగా చూడాలని అన్నారు. స్పీకర్ స్థానం హోదాను నిలబెట్టేలా ఆయన వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గకుండా.. స్పీకర్ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఒక వేళ సీఎం ఒత్తిడి చేస్తే తమకు చెప్పాలని, తాము నిలదీస్తామని అన్నారు.
హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులు సమీక్షించలేవన్న వాదన తప్పని అన్నారు. అయితే, తాజా హైకోర్టు తీర్పుపై వారు అప్పీలుకు పోయే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.