మోడీకి మాటిచ్చారు.. బీజేపీతోనే రేవంత్ ప్రయాణం: కేటీఆర్ సంచలనం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాట ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందని కేటీఆర్ తెలిపారు. శనివారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రధాని మోడీని పల్లెత్తు మాట అనడానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, అసెంబ్లీలోనూ తాను ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు.
రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీయేనని, ఆ పార్టీలో చేరడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. తన రాజకీయ అరంగేట్రం ఏబీవీపీలో ప్రారంభం అయిందని, బీజేపీ జెండా కప్పుకొని చనిపోతానని ప్రధానితో రేవంత్ చెప్పినట్లు తెలిసిందని కేటీఆర్ అన్నారు.

ప్రధానమంత్రి మోడీతో ఈ విషయం చెప్పింది వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అదానీ అంశంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చిందని, అందులోనూ రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదా చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో అదానీకి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆరోపించారు.
మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఆగస్టు 24న రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతానని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని ఘటనల వివరాలు కమిషన్కు తెలియజేస్తానని చెప్పారు. తాను బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారన్నారు.
తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను సీఎం, కాంగ్రెస్ నేతలు అన్న మాటలను కూడా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు కేటీఆర్ చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు అటెండ్ అవ్వాలని సూచించింది. ఈ మేరకు కమిషన్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. బస్సుల్లో అల్లం వెల్లుల్లే కాదు.. బ్రేక్ డ్యాన్సులు కూడా చేసుకోవచ్చంటూ కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications