తొందరేం లేదు.!ఎంత ఆలస్యమైతే అంత మంచిది.!పిసీసీ పదవిపై రేవంత్ రెడ్డి స్పందన..!
హైదరాబాద్ : తెలంగాణ పీసిసి అధ్యక్ష పదవి ప్రకటన యాక్షన్, థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. రోజుకో ఊహాగానంతో కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. ఆశావహులు కొంత మేర శాంతించి వెనక్కు తగ్గినప్పటికి ఎవరికి పిసీసీ పదవి దక్కుతుందనే అంశం ఉత్కంఠను రేపుతోంది. తెలంగాణ ప్రకటించి కూడా పదేళ్లుగా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించే నాయకుడు కావాలన్నది అధిష్టానం కృతనిశ్చయంగా తెలుస్తోంది. ఈ పరంపరలో ముందువరుసలో ఉన్న రేవంత్ రెడ్డి కి అంతర్గతంగా కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయన్నది అక్షర సత్యం.
పీసిసి ప్రకటన మార్చిలోనే.. తొందరేం లేదంటున్న రేవంత్ రెడ్డి..
కాగా ఇలాంటి అవరోధాల పట్ల కూడా రేవంత్ రెడ్డి పాజిటీవ్ దృక్పదంతో వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. రేసులో ఉన్న రేవంత్ పీసిసి ప్రకటన నాన్చుడు ధోరణి పట్ల అసహనం వ్యక్తం చేయాల్సిన తరుణంలో హుందాగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోవాల్సింది పోయి, ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిపోయింది. తెలంగాణ ప్రకటించిన తర్వాత అనూహ్యంగా వరుస ఓటముల పాలవుతూ పార్టీ బలహీనపడిపోయింది. ఇలాంటి సందర్బంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే నాయకుడికి పగ్గాలు అప్పగించాలని ఏఐసీసీ భావిస్తోంది.
నిర్ణయం తీసుకున్న అధిష్టానం.. విభేదాలు తలెత్తకుండా ఉండేందుకే ప్రకటన వాయిదా..
ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పనిచేసి, అధికార పార్టీ వ్యూహాలను సమర్ధవంతంగా తిప్పి కొడుతూ పార్టీకి ఓ చరిష్మా తీసుకొచ్చే నాయకుడు కావాలని అదిష్టానం భావించి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పిసీసీ బాద్యతలు కట్టబెట్టేందుకు రంగం సిద్దం చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీలో సహజంగా ఉండే ఆదిపత్య పోరు, అంతర్గత విభేదాల వల్ల పిసీసీ ప్రకటన ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మనిక్కం ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరిలో లేదా మార్చిలో జరగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత పీసిసి అద్యక్ష ప్రకటన ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద ఊహించిని రీతిలో స్పందించినట్టు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డికి అన్ని తెలుసు.. వ్యూహాత్మక నిశ్శబ్దంలో మల్కాజిగిరి ఎంపి..
పరీక్షల్లో వంద మార్కుల పేపర్ కు మొత్తం సమాధానాలు రాసిన విద్యార్ది ప్రవర్తనకి, అసలేం రాయకుండా బ్లాంక్ పేపర్ ఇచ్చిన విద్యార్థి కదలికలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కౌన్ బనేగా కరోడ్ పతిలో అమితాబ్ బచ్చన్ జవాబు తెలిసిన ప్రశ్న అడిగితే ముఖ కవలికలు ఎలా ఉంటాయి, జవాబు తెలియని ప్రశ్న అడిగితే అదే మొహంలో ఏవిధమైన కంగారు కనిపిస్తుందో అందనికి తెలిసిందే. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సమాధానం తెలిసిన కంటెస్టెంట్ ఏమీ మాట్లాడని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని సమస్యలకు కాలం పరిష్కారం చూపుతుందనే సిద్దాంతానికి పూర్తిగా కట్టుబడి ఉన్న వాడిలా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి. అందులో బాగంగానే పీసిసి ప్రకటనలో జరుగుతున్న జాప్యం పట్ల రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించినట్టు తెలుస్తోంది.
ప్రకటన ఎంత ఆలస్యమైతే అంత మంచిది.. హుందాగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి..
తెలంగాణ పీసిసి ప్రకటన ఎంత ఆలస్యం ఐతే అంత మంచిదే అనే ధోరణిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. కళ్ల ముందు జరుగుతున్న వైఫల్యాలను అధిగమించి పార్టీని విజయతీరాలకు చేర్చాలంటే అందరికి ఓ ఏకాభ్రిప్రాయం రావాలని, అందుకోసం కొంత సమయం తీసుకుంటుందని, తాను పీసిసి పదవికోసం తొందరపడడంలేదనే సంకేతాలను ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ జీవం పోసుకోవాలంటే అది రేవంత్ రెడ్డి లాంటి చురుకైన నాయకుడి వల్లనే సాద్యమన్న అంశం పార్టీలో ఢిల్లీ నుండి గల్లీదాకా తెలుసనే అభిప్రాయాలను రేవంత్ అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా అంతా మన మంచికే అనే దోరణిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.