కేసీఆర్.. ఎమ్మెల్యేలకు ఇచ్చినవి డబ్బు డబ్బాలే: రూ.కోట్లేనంటూ రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ అన్నారని, ఆ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, షబ్బీర్ అలీ తెలిపారు.
గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తానని పార్టీ నేతలతో చెప్పిన కేసీఆర్కు అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల కాలంలో మంచి పనులు చేస్తే సభ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ప్రగతి నివేదన సభ కోసం ఒక్కో ఎమ్మెల్యేకు కేసీఆర్ కోటి రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. 'టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పేదలెవరూ లేరు. అందరూ ధనవంతులే. కానీ.. నిన్న జరిగిన సమావేశంలో డబ్బాల కోసం ఎగబడ్డారు. రెండు వేలు, మూడువేల రూపాయలు ఖర్చుపెడితే ఆ డబ్బాలు పట్టే పార్టీ జెండాలు, కండువాలు నిండిపోతాయి' అని రేవంత్ అన్నారు.
అంతేగాక, 'ఆ డబ్బాలో టీఆర్ఎస్ సామగ్రి ఎంత వస్తుంది? రెండు, మూడు వేల రూపాయల కోసం ఎమ్మెల్యేలు ఎగబడి డబ్బాలు తీసుకుంటారా? ప్రగతి నివేదన సభకోసం ఒక్కో ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ బాక్సుల్లో పెట్టి రూ.కోటి చొప్పున ఇచ్చారు. కాటన్ డబ్బాలను గన్మెన్లతో మోయించారు. అందులో డబ్బులు లేకపోతే ఆ డబ్బాలకు తుపాకుల పహారా ఎందుకు?'' అని రేవంత్రెడ్డి నిలదీశారు.