దెయ్యాల రాష్ట్ర సమితిని పొలిమేరల వరకు తరిమికొట్టాలి: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది బీఆర్ఎస్ కాదు డీఆరెస్.. భారత రాష్ట్ర సమితి కాదు... దెయ్యాల రాష్ట్ర సమితి అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ ఇంటి బిడ్డనే చుట్టూ దయ్యాలు ఉన్నాయని బయటపెట్టినా... ఆ దయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాలన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత రాష్ట్ర సమితి కాదు... దెయ్యాల రాష్ట్ర సమితి అన్నారు. పదేళ్లు దోచుకుతిన్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తారట అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క నోటీసు ఇస్తేనే ఆగమాగం అయితుండు.. జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండు. ముందు నీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
"యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశాం. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. యాదగిరిగుట్ట అలయం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. నవంబర్ 8న పాదయాత్ర చేసి మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతామని మాట ఇచ్చా. ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవనం చేసి తీరుతాం. మోదీ సబర్మతి, గంగా నది ప్రక్షాళన చేసుకోవచ్చుగానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?.. మా నల్లగొండల బిడ్డలు మూసీ మురికి కూపంలో బ్రతకావాల్సిందేనా?ఎవరేం అనుకున్నా సరే.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

"నల్గొండ గడ్డ చైతన్యానికి మారుపేరు. నిజాం నవాబులను దిగంతాలకు తరిమిన చరిత్ర నల్గొండది. ఎవరో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే నల్గొండ బిడ్డలు చూస్తూ ఊరుకోరు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నల్గొండకు వాళ్లు చేసిందేం లేదు. ఎస్ఎల్బీసీ, బునాదిగాని కాలువ.. ఇలా పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదు" అని సీఎం రేవంత్ మండిపడ్డారు.
అంతేకాక మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. "బీఆర్ఎస్ కాదు డీఆరెస్.. డీఈ దెయ్యాల రాష్ట్ర సమితి.. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాలి. పదేళ్లు దోచుకుతిన్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తారట. ఆనాడు వాసాలమర్రికి వచ్చి.. ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండు ఇచ్చి ఆసుపత్రి పాలు చేసిండు. వాసాలమర్రిలో ఇండ్లు కూలగొట్టి శ్మశానంగా మార్చిండు. ఆయన ఆగం చేసినా వాసాలమర్రి పరిస్థితిని బాగు చేయాలని మా నాయకులను ఆదేశిస్తున్నా మేం అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. నీళ్లు ఎలా ఇస్తారని కొందరు మాట్లాడుతున్నారు. ఎస్ఆరెస్పీ, మిడ్ మానేరు కట్టిందెవరు. ప్రాజెక్టులు కట్టిన మాకు గంధమల్లకు నీళ్లు ఎట్లా ఇవ్వాలో మాకు తెలియదా?.." అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
"ప్రజాపాలనలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్నికల్పించాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించాం. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చింది నిజం కాదా? అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతిలో పెట్టింది నిజం కాదా.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని మేం ప్రయత్నిస్తుంటే కొంతమంది ఏడుస్తున్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసింది నిజం కాదా. రైతులు పండించిన ప్రతీ గింజ కొంటూ రైతులను ఆదుకుంటుంటే కడుపులో విషం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు. కులగణన ద్వారా బీసీల లెక్క తేల్చి 42 శాతంరిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశాం... కేంద్ర ప్రభుత్వం కులగణన చేసే అనివార్యతను కల్పించాం. ఎస్సీవర్గీకరణ చేసి దశాబ్దాల పోరాటాల కలను నెరవేర్చాం. ఇంతకంటే నాకు ఇంకా కావాలి? " అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఆనాడు తొడగొట్టి పడగొడతానని చెప్పా... పడగొట్టి చూపించా.. పట్టు పట్టిన... పడగొట్టిన... ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందున్నా. నాకు ఇక వేరే కోరిక లేదు... తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం. ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అయితుండు... జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండు. ముందు నీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మాట ఇస్తున్న" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications