ఈటల రాజేందర్ కు మరోసారి నోటీసులు - ఈ నెల 16న విచారణకు రావాలంటూ : ఏం జరుగుతోంది..!!
తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేత ఈటల రాజేందర్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి మరోసారి నోటీసులు అందాయి. గతంలోనే మసాయి పేట లో ఈటెల రాజేందర్ కి చెందిన జమున హేచరీస్ పేరుతో దళితులు కి చెందిన ఆసైన్డ్ భూములు ఈటెల కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. మసాయి పేట కి చెందిన రైతులు ఫిర్యాదు చేయడం తో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు. అప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. ఇక, ఆ తరువాత ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించారు.
ఇవే ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తప్పించి
ఆయన తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీలో చేరి హుజూరాబాద్ నుంచే తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక, ఇప్పుడు మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా కేసులో విచారణ వేగవంతమైంది. కరోనా కారణంగా ఇన్నాళ్లు విచారణ పెండింగ్లో పడింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి విచారణ చేయనున్నారు. అచ్చంపేట, హాకీంపేటలో కూడా సర్వే కొనసాగనుంది. జమునా హ్యాచరీస్కు జూన్లోనే నోటీసులు జారీ చేశారు. అయితే కరోనా కారణంగా విచారణ ముందుకు సాగలేదు.
సర్వే అధికారుల నోటీసులు
ఇప్పుడు కోర్టు ఆదేశాలతో విచారణ వేగవంతం చేయనున్నారు. తాజాగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని నోటిసుల్లో కోరింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచంపేట, హకీమ్పేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు రావటం..దీని పైన ఈటల కోర్టుకు ఎక్కటంతో ఇప్పుడు ఈ వ్యవహారం న్యాయస్థానంలో పెండింగ్ లో ఉంది. అయితే, హుజూరాబాద్ ఎన్నిక ముగిసిన వెంటనే ఈ నోటీసులు జారీ కావటం పైన రాజకీయంగానూ చర్చ సాగుతోంది.
విచారణకు హాజరు కావాలంటూ
ఇప్పుడు ఈ నోటీసుల్లో పేర్కొన్నట్లగా ఈటల 16న విచారణకు హాజరవుతారా లేక...న్యాయస్థానం ఆశ్రయిస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే, తాను ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదని ఈటల చెబుతున్నారు. ఇప్పుడు అధికారులు ఈ విషయంలో కోర్టు సూచనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఈటల మద్దతు దారులు చెబుతున్నారు. ఎలాంటి విచారణకు అయినా సిద్దమేనిన..ఎక్కడా ఎటువంటి కబ్జా కు పాల్పడలేదని వారు స్పష్టం చేస్తున్నారు.
ఈటల ఏం చేయబోతున్నారు
జమున హేచరీస్ తో పాటుగా మరో 200 మందికి సర్వే నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సీలింగ్.. అసైన్డ్ భూముల పైన పూర్తి స్థాయిలో సర్వే చేయనున్నట్లుగా సమాచారం. ఆ ప్రాంతాల్లో పూర్తి సర్వే నిమిత్తం ఈ నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో..ఈ వ్యవహారం పైన ఈటల ఏ రకంగా రియాక్ట్ అవుతారో..ఏం సమాధానం ఇస్తారనేది చూడాలి.