పవన్ కళ్యాణ్ సిగ్గుపడలేదు, నాకు కనువిప్పు కలిగింది, థ్రిల్ అయ్యా: వర్మ
Recommended Video
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ప్రముఖ వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు. ఈసారి మరింత ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇటీవల పవన్ ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్పై దాదాపు నిత్యం స్పందించే వర్మ.. ఈ పర్యటనపై ఏమీ మాట్లాడకపోవడంపై చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ తాజాగా శుక్రవారం ఆయన జనసేనానిపై ఓ పోస్ట్ పెట్టారు. తన ఫేస్బుక్ పేజీలో దానిని పోస్ట్ చేశారు.
పవన్ కళ్యాణ్కు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా
పవన్ కళ్యాణ్కు నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ ప్రారంభించారు వర్మ. పవన్ కళ్యాణ్ తాజా ప్రసంగం చూశానని, దానిని చూసి తాను ఎంతో థ్రిల్ అయ్యానని పేర్కొన్నారు. వివిధ అంశాలపై ఆయనకు ఉన్న పరిజ్ఞానాన్ని చూసి తాను థ్రిల్ అయ్యానని చెప్పారు.
స్పష్టత ఇచ్చారు
పవన్ కళ్యాణ్ ఈ పర్యటన ద్వారా గతంలో ఉన్న, ప్రస్తుతం వినిపిస్తున్న వాటిపై స్పష్టత ఇచ్చారని వర్మ పేర్కొన్నారు. గతం, భవిష్యత్తు గురించి అందరినీ ఆకట్టుకునేలా చెప్పారని అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యల్లో నిజాయితీ కనిపించిందని చెప్పారు.
పవన్ ఏమాత్రం సిగ్గుపడలేదు
తన అభిప్రాయాలు, ఆలోచనలను చెప్పేందుకు పవన్ కళ్యాణ్ ఏమాత్రం సిగ్గుపడలేదని వర్మ పేర్కొన్నారు. పేర్లతో సహా ప్రకటించి తన ఆలోచనలు మరియు భావాలను దాచలేదని చెప్పారు. పవన్ను చూస్తుంటే తనకు పర్వత శిఖరం అంత సమగ్రత కనిపించిందన్నారు.
పవన్ నుంచి నేర్చుకున్నా
ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుతానని చెప్పడం చూసి, తాను ఇప్పుడు ఒక పాఠం నేర్చుకున్నానని వర్మ అన్నారు. ఎందుకంటే తాను ఆలోచించకుండా మాట్లాడటం, మరియు ట్వీట్ చేయడం వంటివి చేస్తానని చెప్పారు. పవన్ ప్రసంగం విన్నాక తనకు కనువిప్పు కలిగిందన్నారు.
పవన్ పెద్ద నాయకుడిగా ఉంటాడని భావిస్తున్నా
అందుకే ఎలాంటి ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్కు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని వర్మ అన్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఒక రకమైన పెద్ద నాయకుడిగా ఉంటాడని భావిస్తున్నానని పేర్కొన్నారు.