ఏపీ రాజధాని అమరావతి: రూ.550 కోట్లతో రోడ్డు వెడల్పుపై తుమ్మల
ఖమ్మం: ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్డును మరింత వెడల్పు చేయనున్నారు. విజయవాడ ఏపీ రాజధాని అమరావతికి దగ్గరలో ఉంది. ఈ రహదారి వెడల్పుకు రూ.550 కోట్లు అవసరం కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం ఖమ్మం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఈ రహదారి పైన ట్రాఫిక్ ఎక్కువగా అవుతోందన్నారు. ఈ కారణంతో రోడ్డును పెంచాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ఖమ్మం జిల్లాను అన్ని జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తామని చెప్పారు. తద్వారా రవాణాను సులభతరం చేస్తామన్నారు. ఏపీ రాజధాని అమరావతి నేపథ్యంలో... సమీపంలో ఉన్న విజయవాడ - జగదల్పూర్ రోడ్డు బిజీగా మారనుంది.
ఖమ్మం జిల్లా వాజేడు మండలం పూసూరు నుంచి రూ.300 కోట్లతో నిర్మించే జాతీయ రహదారి పనుల ప్రారంభానికి సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 23న శంకుస్థాపన చేస్తారని చెప్పారు. రూ.2వేలతో వరంగల్ నుంచి యాదాద్రి వరకు నిర్మించే నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులకు కెసిఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు.
పచ్చటి తెలంగాణ కావాలి: కడియం శ్రీహరి
పత్తి కొనడానికి మార్గదర్శకాలు లేవని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం చెప్పారు. వరంగల్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతాంగాన్ని మోసం చేసేది బిజెపి, టిడిపిలే అన్నారు. వరంగల్పై ప్రతిపక్షాలకు ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవినీతి, అక్రమాలు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం శాంతి చర్చల పేరుతో నక్సలైట్లను ఏరివేసిందన్నారు. మావోయిస్టులను పిట్టల్లా కాల్చిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. ఎన్కౌంటర్లు తమకు సమ్మతం కాదన్నారు.
నెత్తుటి తెలంగాణ వద్దు.. పచ్చని తెలంగాణ కావాలన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో వచ్చే ప్రజల తీర్పే పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. తాము ఇవ్వని హామీలు కూడా నెరవేర్చామన్నారు. వెసులుబాటును బట్టి రుణమాఫీ కోసం ఆలోచిస్తున్నామని చెప్పారు.
పత్తికి మద్దతు ధర పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అన్నారు. కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారన్నారు. రైతులను మోసం చేసింది కాంగ్రెస్, టిడిపిలే అన్నారు. శాంతిచర్చల పేరుతో నక్సలైట్లను కాల్చేశారన్నారు.