(పిక్చర్స్): అప్పారావుకు వీసీ అయ్యే అర్హతే లేదు, ఏబీవీపీ ఆఫీస్పై దాడి
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థుల నిరాహారదీక్షను భద్రతా సిబ్బంది శనివారం భగ్నం చేసింది. దీక్షకు దిగిన ఏడుగురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
అంతకుముందు దీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం విద్యార్థుల దీక్షను భగ్నం చేసేందుకు వర్శిటీ భద్రతా సిబ్బంది యత్నించింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేముల రోహిత్ ఆత్మహత్య సంఘటన నేపథ్యంలో విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
వేముల రోహిత్
హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల దళితుడు కాదని, అతడి తల్లి తండ్రులిద్దరూ వడ్డెర కులస్తులేనని (ఏపీలో బీసీలు) కేంద్రానికి అధికార వర్గాలు తమ నివేదించినట్లు తెలిసింది. ఈ మేరకు రోహిత తండ్రి మణికుమార్, తల్లి రాధిక 2014 జూలై రెండో తేదీన ఇచ్చిన అఫిడవిట్లను జత చేసినట్లు సమాచారం.
వేముల రోహిత్
వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా నాలుగు రోజులుగా హైదరాబాద్ హెచ్సీయూలో జరుగుతోన్న అమరణ నిరాహారదీక్షను భద్రత అధికారులు శనివారం సాయంత్రం భగ్నం చేశారు. దీక్షచేస్తున్న ఏడుగురిలో ఆరుగురిని వర్శిటీలోని వైద్యకేంద్రానికి, మరో విద్యార్థిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
వేముల రోహిత్
దీక్ష చేస్తోన్న విద్యార్థులకు వర్సిటీ ఆరోగ్యాధికారి రవీందర్ ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యం క్షీణిస్తోందని, వైద్య సహాయం అవసరమని మీడియాకు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే వారిని ఆరోగ్యకేంద్రానికి తరలించాల్సి వచ్చిందన్నారు.
వేముల రోహిత్
రమేష్ పరిస్థితి బాగాలేనందున ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. వైఖరి, జయరావు, కృష్ణయ్య, రమేష్, ప్రభాకర్, మనోజ్, ఉమామహేశ్వర్రావుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అయితే, అనంతరం వారిలో ఇద్దరిని నానక్రాంగూడ కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.
వేముల రోహిత్
జయరావ్ (31), రమేష్ (26)అనే విద్యార్థులను ఐసీయూలో చేర్చారు. వారిలో చక్కెర స్థాయి, రక్తపోటు తక్కువగా ఉన్నందున, పరిశీలనలో ఉంచామని వైద్యులు తెలిపారు.
వేముల రోహిత్
వర్శిటీలో సాయంత్రం వరకు జరిగిన ఆందోళనలో ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి, సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు.
వేముల రోహిత్
రోహిత్ సోదరి నీలిమ మాట్లాడుతూ... వర్సిటీ నుంచి రోహిత్ను ఎందుకు సస్పెండ్ చేశారో మాకు తెలియజేయకుండా అధికారులు కుయుక్తులు పన్నుతున్నారని, విషయాలను ముందుగా మాకు ఎందుకు తెలియజేయలేదని, రోహిత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో చెప్పకుండా మమ్మల్ని కలిసేందుకు వీసీ అప్పారావు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు.
వేముల రోహిత్
రోహిత్ మృతిపై సుప్రీం న్యాయమూర్తితో విచారణ జరిపించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వీసీ అప్పారావు తన పదవికి రాజీనామా చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తదితరులు శనివారం కోరారు.
వేముల రోహిత్
రోహిత్ కుటుంబానికి తప్పక న్యాయంచేస్తామని జవహర్నగర్ కేంద్రీయ విద్యాలయ జాతీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన కేంద్ర సహాయమంత్రి ఉపేంద్ర కుష్వాహ స్పష్టం చేశారు.
వేముల రోహిత్
రోహిత్ మృతిపై నిజానిజాలు వెలికితీసేందుకు ఇప్పటికే మానవవనరుల మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఆర్డీ) నుంచి ఇద్దరు సభ్యులతో కమిటీ వేశామని కేంద్రసహాయ మంత్రి ఉపేంద్ర అన్నారు. త్వరలో కేంద్రం న్యాయవిచారణ సంఘాన్ని వేసేందుకు సిద్ధమవుతోందన్నారు. మూడు నెలల్లో విచారణ పూర్తిచేస్తామన్నారు.
వేముల రోహిత్
వీసీ అప్పారావు రాజీనామా తన చేతుల్లో లేదని, విద్యార్థులు ఆందోళన విరమించి వర్సిటీలో ప్రశాంతత నెలకొనేందుకు సహకరించాలని కేంద్ర సహాయమంత్రి ఉపేంద్ర అన్నారు.
వేముల రోహిత్
రోహిత్ ఆత్యహత్యకు కారణమైన వీసీ అప్పారావుకు పరిశోధన రంగంలో సరైన అనుభవం లేదని, 1988లో ఉద్యోగంలో చేరినప్పుడు కేవలం రెండు భారతీయ సైన్స్ మ్యాగజైన్లలో మాత్రమే ఆయన పరిశోధన పత్రాలు ముద్రితమయ్యాయన హెచ్సియు విద్యార్థి రవి కుమార్ చెప్పాడు.
వేముల రోహిత్
1993 వరకు మళ్లీ ఎక్కడ అతని పరిశోధన పత్రాలు కనిపించలేదని, తర్వాతి కాలంలో పరిశోధక విద్యార్థుల థీసిస్లను తన సొంతానికి వాడుకొని గుర్తింపు తెచ్చుకున్నారని, అప్పారావుకు అర్హత లేకున్నా వీసీ పదవి అప్పగించడం కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగమని హెచ్సియు విద్యార్థి రవి కుమార్ చెప్పాడు.
ముంబైలో ఏబీవీపీ కార్యాలయంపై దాడి
ఏబీవీపీ కార్యాలయాన్ని ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ముంబయిలోని మతుంగాలో ఉన్న కార్యాలయంపై శనివారం జరిగిన ఈ దాడిలో ఓ ఏబీవీపీ కార్యకర్త కూడా గాయపడ్డారు. రోహిత్ ఆత్మహత్యతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తోందని, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే ఎన్ఎస్యూఐ ఈ దాడికి పాల్పడిందని ఏబీవీపీ మండిపడింది.