హుజూరాబాద్ ఉపఎన్నికపై టీఆర్ఎస్ ఖర్చు 500 కోట్లు, చరిత్ర తిరగరాశారు: ఈటల రాజేందర్
కరీంనగర్: అధికార టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ముందుకొచ్చి ఓటర్లు తనను ఆశీర్వదించారని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. ఓటర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం శనివారం రాత్రి బీజేపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉపఎన్నికపై కేసీఆర్ కుట్రలు: ఈటల
అన్ని ఉపఎన్నికల మాదిరిగానే ఇక్కడ కూడా ఓటర్లకు డబ్బులు పంచి, అసత్య వాగ్ధానాలు చేసి గెలవొచ్చని టీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ కేసీఆర్ ప్రయత్నించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. కానీ, హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు చరిత్రను తిరిగరాశారని భావిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కుట్రలను హుజూరాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు.
ఉపఎన్నికపై టీఆర్ఎస్ రూ. 500 కోట్ల ఖర్చు: ఈటల
హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం అధికార టీఆర్ఎస్ రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఖర్చు చేసిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. అయినా ధర్మం, ప్రజాస్వామ్యాన్ని, ఈటలను కాపాడుకోవాలని ప్రజలు భావించారని చెప్పారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఓటర్లందరికీ ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. హుజూరాబాద్ మొదటి నుంచి చైతన్యవంతమైన గడ్డ అని, అన్యాయాన్ని, ఆధిపత్యాన్ని సహించే గడ్డ కాదని అన్నారు. ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్, విజయశాంతి, డీకే అరుణ, కేంద్రమంత్రులు, జాతీయ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారంలో కష్టపడి పనిచేసిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈటల రాజేందర్.
ఈటల కాన్వాయ్లోని మూడు కార్లు సీజ్
శనివారం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్లోని పోలింగ్ బూత్ నంబర్ 262లో ఓటు వేశారు. నియోజకవర్గంలో పలు కేంద్రాలకు వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాన్వాయ్కు చెందిన మూడు వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. కమలాపూర్ మండలం మరిపెల్లి గూడెంలో వాహనాలకు అనుమతిలేదని ఈటలకు చెందిన మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా ఈటల రాజేందర్ పీఆర్వోను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
88 ఫిర్యాదులు, చర్యలు తీసుకుంటామన్న ఈసీ: భారీగా ఓటింగ్
హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నిక తీరును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ పరిశీలించారు. కమలాపూర్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన.. నియోజకవర్గంలోని 306 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందాయని వాటిపై వివరాలు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. డబ్బుల పంపిణీపై అందిన ఫిర్యాదులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని గోయల్ చెప్పారు. ఓటర్లు చాలా ఉత్సాహంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఫిర్యాదులపై విచారణలో నిజాలు తేలితే ఎన్నికల అనంతరం కూడా చర్యలు తీసుకుంటామని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. కాగా, శనివారం రాత్రి 7 గంటల వరకు 86 శాతానికిపైగా ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, కేంద్రంలోని పలువురు ఓటర్లు 7గంటల తర్వాత కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.