అద్దె బస్సులపై దాడులు చేస్తున్న ఆర్టీసి కార్మికులు..!
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలోనే ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ మరియు అద్దె బస్సులలను నడుపుతోంది. ప్రైవేట్ బస్సుల్లో కూడ ప్రజలు కిక్కిరిసి వెళుతున్నారు.అయితే ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేయడంతోపాటు తమ ఐక్యతను చాటుకునేందుకు ప్రైవేట్ బస్సులు నడుపుతున్న వారిపై కార్మికులు దాడులు చేస్తున్నారు. పోలీసుల బందోబస్తుతో బస్సులు నడుపుతున్నా కార్మికులు మెరుపు దాడులు చేస్తున్నారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఆర్టీసి కార్మీకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే యాదగిరిగుట్ట డిపో పరిధిలోని బస్సును నడిపేందుకు సిద్దమైన తాత్కాలిక డ్రైవర్ , కండక్టర్పై సమ్మెలో పాల్గోన్న మహిళ కండక్టర్ వారిపై దాడి చేశారు. చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు కార్మికురాలిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ డిపోల్లో ఆందోళన చేస్తున్న కార్మికులను ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
మరోవైపు వికారాబాద్ జిల్లాలో కూడ ఇదే రకమైన దాడులు జరిగాయి. వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం వద్ద బస్సుపై దాడులు జరిగాయి. వెళుతున్న బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు టూవీలర్పై వచ్చి దాడులు చేసి వెళ్లిపోయారు. దీంతో బస్సులు అద్దం పగిలిపోయింది. అయితే ఈ దాడిలో ఎలాంటీ ప్రమాదం జరగలేదు. అయితే బస్సు వెంట ఎస్కార్టు వాహనం ఉన్నప్పటికి బస్సుపై దాడి చేసి వెంటనే వారు పారిపోయారు. ఆర్టీసీ ఉద్యోగులే బస్సులపై దాడి చేశారని వారు పోలీసులు భావిస్తున్నారు.