రైతులకు తీపి కబురు.. త్వరలోనే మీ ఖాతాల్లో రూ. 7500 నగదు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు రైతు భరోసా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం రైతు భరోసా అమలు చేస్తామని, రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేసి 7500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ రైతులకు హామీ ఇచ్చింది.
రైతు భరోసా పై శుభవార్త
ఇక హామీని నిలబెట్టుకునే క్రమంలో కసరత్తు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులకు సంక్రాంతి పండుగ నుండి సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరానికి 5000రూపాయలు ఇవ్వగా, ప్రస్తుతం రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలో యాసంగి సాగుకు ఎకరానికి 7500 చొప్పున రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

శాసనసభ సమావేశాలలో దీనిపై కీలక నిర్ణయం
ఇక ఈ మేరకు డిసెంబర్ రెండో వారంలో నిర్వహించే శాసనసభ సమావేశాలలో దీనిపైన చర్చించి విధివిధానాలు కూడా ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ లోపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి సేకరించిన అభిప్రాయ సేకరణ డేటాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం నివేదికను సమర్పించనుంది. ఈ ఉపసంఘం సమర్పించే నివేదికపై కూడా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
రైతు భరోసా ఈ భూములకు లేనట్టే
ఇక గత ప్రభుత్వం రైతుబంధును సాగు యోగ్యం లేని భూములకు, ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ ఇచ్చిన క్రమంలో ప్రస్తుతం మాత్రం రైతు భరోసా పైన కొన్ని పరిమితులు విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో రైతుభరోసా ఇవ్వడానికి ప్రాతిపదిక ఏంటి అన్న దానిపైన పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. వ్యవసాయ భూముల జాబితాలో భూములు ఉన్నా కూడా సాగుకు యోగ్యంగా లేని వాటిని రైతు భరోసా నుంచి తొలగిస్తారని చర్చ జరుగుతుంది.
ఎన్ని ఎకరాలకు పరిమితి విధిస్తారో?
ముఖ్యంగా బీడు భూములు, కొండలు, గుట్టలు ఉన్న భూములు, పంటలు పండని వాటికి పెట్టుబడి సాయం నిలిపివేయనున్నట్టు చెబుతున్నారు. కేవలం సాగుచేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తారని కూడా భావిస్తున్నారు. అంతేకాదు రైతు భరోసా ఇచ్చే విషయంలో ఎన్ని ఎకరాల వరకు పరిమితి పెడతారు అనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఏడున్నర ఎకరాల వరకు పరిమితం చేస్తారా లేక 10 ఎకరాల వరకు పరిమితి విధిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
వచ్చే నెలలో కీలక నిర్ణయం, జనవరిలో రైతు భరోసా
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలను తీసుకుని తయారు చేసిన మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా శాసనసభలో చర్చ నిర్వహించిన తర్వాత రైతు భరోసా విషయంలో ఏ విధంగా ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? అనే దానిపైన కీలక నిర్ణయం తీసుకుంటారన్నది తెలుస్తుంది. ఏది ఏమైనా జనవరి నెలలో వచ్చే సంక్రాంతి నాటికి రైతులకు రైతు భరోసా అందబోతుంది అన్న శుభవార్త ప్రస్తుతం రైతన్నలకు సంతోషం కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications