ఎర్రబెల్లిపై వరంగల్లో కేసు, డబ్బు దగ్ధం కావడం చూశాం: టీఆర్ఎస్
వరంగల్: తెలంగాణ శాసనసభా పక్ష నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు పైన వరంగల్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదయింది. ఎర్రబెల్లి తనను కులం పేరుతో దూషించారని వినోద్ అనే వ్యక్తి వరంగల్లోని మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదయింది.
గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ రద్దు చేయాలి
గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి నాయకుడు మానవతా రాయ్ డిమాండ్ చేశారు. ఓయులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సోమవారం మాట్లాడారు.
విద్యార్థులు, నిరుద్యోగులను సిఎం కెసిఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చాలీచాలని నోటిఫికేషన్లతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో ఓయులో విద్యార్థి ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల డబ్బు దగ్ధం కావడం చూశాం: రామలింగా రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నేతలు ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం ఆందోళనలు చేస్తామని చెప్పడం విడ్డూరమని టిఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కాంగ్రెస్ నేతలు దోపిడీకి పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ నేతలు తిరుగుతున్న కార్లు, డీజిల్ ఇందిరమ్మ పేరుతో కొట్టేసిన అవినీతి సొమ్ము అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులో దోచుకున్న డబ్బును ఉత్తమ్ తరలిస్తుండగా దగ్ధమైన దృశ్యాలను అందరూ చూశారన్నారు.