రేవంత్ VS కేసీఆర్, మరో ఎన్నికల సమరానికి సై - రాజీనామాలు..కొత్త లెక్కలు..!!
తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి సర్వం సిద్దం అవుతోంది. జూబ్లీహిల్స్ విజయంతో కాంగ్రెస్ జోష్ మీద ఉంది. ఇదే సమయంలో స్థానిక ఎన్నికలకు కసరత్తు జరుగుతోంది. ముహూర్తం ఖరారైంది. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. స్పీకర్ తన తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు వేటు పడకుండా రాజీనామా తప్పదనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. దీంతో.. స్థానికంతో పాటుగా అసెంబ్లీకి ఉప ఎన్నికలు ఇప్పుడు రాజకీయం గా ఉత్కంఠ పెంచుతున్నాయి.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసాయి. ఈనెల 24 లేదా 25న షెడ్యూలు విడుదల చేసి డిసెంబరు 17నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ఎస్ఈసీ భావిస్తోంది. బీసీలకు 42శాతం కోటాపై కోర్టులో వివాదాలు ఉన్నందున పాత పద్ధతిలోనే పంచాయతీల ఎన్నికలు జరపాలని ఈనెల 17న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా సిఫార్స్ చేయాలన్న కేబినెట్ సూచన మేరకు బూసాని వెంకటేశ్వరరావు సారథ్యంలోని డెడికేటెడ్ కమిషన్ పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాలను సిఫార్స్ చేస్తూ సీఎస్కు నివేదిక సమర్పించింది. ఈనెల 24న జరిగే హైకోర్టు విచారణకు ముందే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కాగా, ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారుచేస్తే ఈనెల 24న హైకోర్టులో విచారణ పూర్తికాగానే అదేరోజు లేదా మరుసటిరోజు షెడ్యూలు ప్రకటించాలని ఎస్ఈసీ భావిస్తోంది. 3విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. డిసెంబరు 17వరకు వార్డు సభ్యులు, సర్పంచ్ల ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డులు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటించేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 23న ఓటర్ల తుదిజాబితా ప్రచురించనున్నారు. మార్చి 31లోపు పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేల పై ఫిరాయింపు ఆరోపణల పైన స్పీకర్ విచారణ దాదాపు పూర్తి చేసారు. ఈ పిటీషన్ల పైన తాజాగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కాగా.. ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మాత్రం నిర్ణయం భిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. ఈ ఇద్దరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అందులో భాగంగా దానం ఢిల్లీ వెళ్లారు. వారిద్దరితో రాజీనామా చేయిస్తే.. వారి నియోజకవర్గాల్లో పరిస్థితుల పైన ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు. సీఎం రేవంత్ -మాజీ సీఎం కేసీఆర్ కు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం గా మారనున్నాయి. దీంతో.. ఇప్పుడు స్థానికంతో పాటుగా ఉప ఎన్నికల వ్యవహారం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications