వరంగల్లో లాయర్ నిర్వాకం: యువతిని లొంగదీసుకుని చిత్రహింసలు
హైదరాబాద్: తన వద్ద ప్రాక్టీస్ కోసం చేరిన ఓ యువతిని లొంగదీసుకుని తీవ్రంగా వేధించాడో సీనియర్ లాయర్. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... వరంగల్లో దయానంద్ అనే సీనియర్ లాయర్ తన వద్ద జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
అంతేకాదు గత రెండు రోజులుగా ఆమెను ఓ గదిలో నిర్భందించి చిత్రహింసలకు గురిచేశాడు. వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకోనివ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు. యువతి పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించాడు. ఎట్టకేలకు సీనియర్ లాయర్ బారి నుంచి తప్పించుకున్న ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఒంటికి నిప్పంటించుకుని యువతి ఆత్మహత్య
తల్లికి ఆనారోగ్యం, తాను కూడా మూర్ఛ వ్యాధితో బాధపడుతుండటంతో పీజీ చదువుతున్న విద్యార్ధిని తన అమ్మమ్మ ఇంటికొచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ గ్రామంలో సోమవారం జరిగింది.
మృతురాలి బంధువులు, ఎస్సై దుడ్డెల గురుస్వామి కథనం ప్రకారం... వరంగల్లోని దయానంద కాలనీకి చెందిన కోన్రెడ్డి అరుణ-వుల్లారెడ్డి దంపతుల కుమార్తె శ్రీవిద్య(28) వరంగల్లో పీజీ వరకు చదువుకుంది. గత కొంతకాలంగా మూర్ఛవ్యాధితో బాధపడుతూ మతిస్థిమితం కోల్పోయింది.
ఇటీవల శ్రీవిద్య తల్లి అరుణ ఇంటివద్ద కిందపడటంతో తలకి తీవ్రగాయమై హైదరాబాద్లో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో శనివారం తల్లిని వెళ్లి చూసి మనస్తాపానికి గురైంది. అనంతరం శ్రీ విద్య ఆదివారం అమ్మమ్మ శకుంతలమ్మ ఇంటికొచ్చింది.
తల్లి పరిస్థితిని చూసి తట్టుకోలేక మనస్తాపానికి గురైన శ్రీవిద్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు శ్రీవిద్య కుటుంబీకులకు సమాచారమిచ్చారు. అమ్మమ్మ ఇంటికి వచ్చి చూసేసరికి శ్రీవిద్య అప్పటికే మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గురుస్వామి తెలిపారు.