సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసు..లొంగిపోయిన దేవరాజ్.. నేడు సాయికృష్ణారెడ్డి విచారణ
సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు లొంగిపోయిన దేవరాజ్ కాకినాడ నుండి వచ్చి నేరుగా పోలీసులకు సరెండర్ అయ్యారు. శ్రావణితో దేవరాజ్ రెడ్డి మాట్లాడిన ఫోన్ సంభాషణలకు సంబంధించిన రికార్డులు పోలీసులకు అందడంతో ఈ సంభాషణలపై పలు కోణాలలో దేవరాజ్ ను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
లొంగిపోయిన దేవరాజ్ .. కొనసాగుతున్న విచారణ
నిన్నటి నుండి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో దేవరాజ్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఈ కేసులో కీలకంగా ఉన్న సాయి కృష్ణారెడ్డిని కూడా పోలీసులు విచారించనున్నారు. శ్రావణి సూసైడ్ కు ముందు జరిగిన ఘటనలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తెరమీదకు కొత్త పేర్లు కూడా వస్తున్నాయి. ఈనెల 7వ తేదీన ఎస్సార్ నగర్ పిఎస్ పరిధిలోని శ్రీ కన్య హోటల్ లో శ్రావణి దేవరాజు ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు.
ఆత్మహత్యకు ముందు శ్రావణి, దేవరాజ్ , సాయి రెడ్డిల మధ్య ఏం జరిగింది
సీసీటీవీ ఫుటేజ్ లో దేవరాజ్ శ్రావణి సాన్నిహిత్యంగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అదే రోజు శ్రావణి, సాయి కృష్ణారెడ్డికి మధ్య ఘర్షణ జరిగినట్టు, శ్రావణి పై సాయికృష్ణా రెడ్డి చెయ్యి చేసుకున్నట్టు దేవరాజ్ పోలీసులతో చెప్పాడు. అయితే సాయి కృష్ణారెడ్డి శ్రావణిపై చెయ్యి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో సాయి కృష్ణా రెడ్డి, శ్రావణి, దేవరాజ్ తో చనువుగా ఉంటూ అతనితో కలిసి తిరుగుతుందని శ్రావణి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో శ్రావణి తల్లిదండ్రులు, శ్రావణిని తీవ్రంగా మందలించారు. అదే రోజు అర్ధరాత్రి శ్రావణి సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది.
నేడు సాయి కృష్ణారెడ్డి విచారణ
ఈ నేపథ్యంలోనే సాయి కృష్ణారెడ్డిని విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయని దేవరాజ్ పోలీసులతో చెప్పినట్లు గా సమాచారం. నేడు పోలీసులు సాయికృష్ణారెడ్డికి కూడా విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే . నటి శ్రావణి దేవరాజ్ రెడ్డి పై ఈ ఏడాది జూన్ లో వేధింపులకు గురి చేస్తున్నారంటూ కేసు పెట్టారు. ఆ సమయంలో ఆమెతో ఓ నిర్మాత మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు.
నిర్మాత విషయంలో దర్యాప్తు .. కేసులో విచారణ వేగవంతం
ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి శ్రావణి ,దేవరాజ్ విషయంలో శ్రావణి కి సలహాలు సూచనలు ఇవ్వడానికి కారణాలేంటి అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. శ్రావణి తో అశోక్ రెడ్డి కి ఉన్న సంబంధం ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా మౌనరాగం, మనసు మమత సీరియల్స్ తో ప్రజలకు దగ్గర అయిన శ్రావణి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు త్వరలోనే ఈ కేసును చేదించనున్నారు .