బ్లూఫిల్మ్స్ చూస్తూ విద్యార్థినులపై లైంగిక వేధింపులు
మహబూబ్నగర్: పాఠశాలలో నీలి చిత్రాలు చూస్తూ విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకుంది. తమ పిల్లలపై పాఠశాల ప్రిన్సిపాల్ వేధింపులు జరపడంతో ఆగ్రహానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.
వనపర్తిలోని సాంధీపని ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తూ భాగస్వామిగా ఉంటున్న జానకిరాంరెడ్డి గత కొంతకాలంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు గురువారం ఇక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు గురువారం పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకొని ధర్నా చేశారు.

పాఠశాల గుర్తింపును రద్దుచేయాలని, లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రిన్సిపాల్ జానకిరాంరెడ్డిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దశలో ఆగ్రహానికి గురైన విద్యార్థి సంఘాల నేతలు పాఠశాలలోకి చొరబడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. టౌన్ ఎస్సై సీతారాంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు బాలికల అత్యాచార నిరోధక చట్టం 2012 కింద, నిర్భయ చట్టం కేసు నమోదు చేసినట్లు తెలపడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
ఎంఇఓ విజయభాస్కర్ పాఠశాలకు చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు నివేదికను పంపనున్నట్లు తెలిపారు. పాఠశాల గుర్తింపును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.












Click it and Unblock the Notifications