మంత్రి గంగుల కమలాకర్ కు షాక్.. మొన్న ఈడీ దాడులు, ఇప్పుడు సిబిఐ నోటీసులు!!
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్న వేళ మంత్రి గంగుల కమలాకర్ కు సిబిఐ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే గంగుల కమలాకర్ కు సిబిఐ నోటీసులు జారీ చేయడానికి గల కారణం మాత్రం ఆసక్తికరంగా మారింది.
గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు
తెలంగాణ పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే మైనింగ్ వ్యవహారంలో ఈడీ దాడులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ క్రమంలో ఆయనకు తాజాగా సిబిఐ కూడా నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈరోజు ఉదయం గంగుల కమలాకర్ ఇంటికి చేరుకున్న సిబిఐ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. గంగుల కమలాకర్ తో పాటుగా గాయత్రి గ్రానైట్స్ రవి చంద్రకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నోటీసులలో రేపు ఢిల్లీలో విచారణకు హజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో సీబీఐ కి ప్రవేశం లేదన్న తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీలో విచారణ చేయనున్నట్టు తెలుస్తుంది.
గంగుల కమలాకర్ కు నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ తో సంబంధాలు
దేశ రాజధాని ఢిల్లీలో అరెస్టైన శ్రీనివాస్ వ్యవహారంలో మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ అరెస్టుతో గంగుల కమలాకర్ కు ఆయనతో ఉన్న సంబంధాలను గుర్తించిన సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. గంగుల కమలాకర్ కు శ్రీనివాస్ తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? వారు ఎప్పుడు ఎప్పుడు కలిశారు? ఏమి మాట్లాడుకున్నారు? అనే కోణంలో కూడా సిబిఐ అధికారులు విచారణ చేయనున్నారు. మంత్రి గంగుల కమలాకర్ తో శ్రీనివాస్ ఉన్న ఫోటోలను కూడా గుర్తించిన సి.బి.ఐ, శ్రీనివాస్ తో గంగుల కమలాకర్ కు ఉన్న సంబంధాలను గురించి విచారించనుంది.

ఢిల్లీలోని తెలంగాణా భవన్ లో నకిలీ సీబీఐ అధికారి అరెస్ట్
ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో విశాఖపట్నం చిన్న వాల్తేర్ కు చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావు ను ఫేక్ సిబిఐ అధికారిగా గుర్తించి ఇటీవల సిబిఐ అరెస్టు చేసింది. నిందితుడు తనను తాను సిబిఐ అధికారిని అని చెప్పుకుంటూ సిబీఐ ప్రధాన కార్యాలయంలో సీనియర్ గా రిటైర్ అయిన ఐపీఎస్ అధికారి గా పరిచయం చేసుకుంటూ వివిధ వర్గాల నుండి డబ్బులు వసూలు చేసే వాడని తేలింది. నిందితుడికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో అధికార యంత్రాంగంతో, ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లుగా తేలింది.

సీబీఐ పేరుతో కోట్ల రూపాయల డీల్ చేసిన శ్రీనివాస్ కు గంగులతో సంబంధం ఏంటి?
సిబిఐ పేరుతో అతను కోట్ల రూపాయల డీల్ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై దృష్టిసారించిన సిబిఐ అధికారులు, అతనికి గంగుల కమలాకర్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి గంగుల కమలాకర్ కు నోటీసులు జారీ చేశారు. నిందితుడు విచారణలో గంగుల కమలాకర్ పేరు చెప్పారా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అతని వద్ద ఉన్న సమాచారంలో గంగుల కమలాకర్ కు సంబంధించి ఏమైనా కీలక సమాచారం ఉందా అన్నది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మొత్తానికి మంత్రి గంగుల కమలాకర్ ను కేంద్ర దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టటం లేదని తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది.












Click it and Unblock the Notifications