సారూ కారు ఓకే .. కానీ పదహారు మాత్రం ఓకే కాదంటున్న తెలంగాణా ఓటర్లు
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఇక ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలోని మొత్తం లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక ఎన్నికల ప్రచారం లో కూడా సారూ , కారు, పదహారు అంటూ జోరుగా ప్రచారం చేశారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అయితే సారూ కారు ఓకే కానీ పదహారు మాత్రం ఓకే కాదని చెప్తున్నారు తెలంగాణా ప్రజలు.

తెలంగాణలో కేసీఆర్ అనుకున్నది ఒకటి ... అవుతోంది ఒకటి
తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టారు . పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీలో గందరగోళం సృష్టించారు. అయినా సరే ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ నాయకులు ఈసారి ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో పట్టు సాధించాలని చాలా కష్టపడ్డారు. ఇక అనూహ్యంగా బీజేపీ నాయకులు సైతం ఈ సారి ఎన్నికల్లో తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కి లోక్ సభ ఎన్నికల్లో షాక్ కొట్టినట్లు అయ్యింది.

16 స్థానాల్లో మూడు చోట్ల బీజేపీ , మూడు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం
తెలంగాణా సీఎం కేసీఆర్ మాత్రం ప్రత్యర్ధి పార్టీకి అంత సీన్ లేదంటూ లోక్ సభ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ దే అంటూ ధీమా వ్యక్తం చేశారు. 16 స్థానాలు గెలుస్తున్నాం అని చెప్పుకున్నారు. కానీ తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. మొదట్లో టీఆర్ఎస్ అనేక స్థానాల్లో ఆధిక్యత కనబరచగా ... పలు రౌండ్ల కౌంటింగ్ తరువాత తాజాగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. సగానికి పైగా స్థానాల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా బీజేపీ తెలంగాణలోని పలు లోక్ సభ స్థానాల్లో ఆధిక్యత కనబరచటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టీఆర్ఎస్కు గట్టి పట్టున్న ప్రాంతాలుగా చెప్పుకునే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది . టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 15 వేల పైచిలుకు ఓట్లతో లీడింగ్లో ఉన్నారు.

మెజార్టీ స్థానాలు దక్కించుకున్నా టీఆర్ఎస్ 16 గెలిచే అవకాశం లేదు
ఇక కరీంనగర్లో బండి సంజయ్ ఆధిక్యం 20 వేలు దాటింది. ఆదిలాబాద్లోనూ టీఆర్ఎస్పై బీజేపీ ఆధిక్యత దిశగా ముందుకు సాగుతోంది. ఇక నల్లగొండ, భువనగిరి, మల్కాజ్ గిరి, చేవేళ్ల స్థానాల్లో కొన్ని కాంగ్రెస్ అభ్యర్థులు టీఆర్ఎస్ కంటే ముందంజలో ఉన్నారు. ఈ స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుండటంతో... ఈ స్థానాల్లో కొన్నింటిని కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం వున్నా 16 మాత్రం సాధ్యం కాదని తాజా కౌంటింగ్ ఫలితాలను బట్టి అర్ధం అవుతుంది.












Click it and Unblock the Notifications