బ్యాంకాక్ వెళ్లేది డ్రగ్స్ కోసమా: ప్రశ్నలతో పూరీ ఉక్కిరిబిక్కిరి, కార్యాలయం వద్ద సాయిరాం హంగామా
డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సిట్ విచారణకు హాజరయ్యేందుకు ఇంటి వద్ద నుంచి బయలుదేరారు. ఆయన వెంట కొడుకు ఆకాశ్, తమ్ముడు సాయి శంకర్ ఉన్నారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సిట్ విచారణకు హాజరయ్యేందుకు బుధవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు. ఆయన వెంట కొడుకు ఆకాశ్, తమ్ముడు సాయి శంకర్ వచ్చారు.
సరిగ్గా పది గంటల సమయంలో పూరి ఎక్సైజ్ ఆఫీస్కు చేరుకున్నారు. సిట్ అధికారులు పూరీని ప్రశ్నించేందుకు వంద ప్రశ్నలు తయారు చేశారు.
డ్రగ్ కేసు: నటుల డైలమా, వారి కోసం వేట! కేసీఆర్ కీలక నిర్ణయం
లంచ్ వరకు..
పూరీ జగన్నాథ్పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయనను 20 ప్రశ్నలు అడిగారు. అనంతరం భోజనం చేసేందుకు విరామం ఇచ్చారు. ఇక్కడే భోజనం చేయాలని అధికారులు పూరీకి చెప్పారు. లంచ్కు ముందు ప్రశ్నించిన ఇరవై ప్రశ్నల్లో... పూరీ బ్యాంకాక్ పర్యటన, కెల్విన్తో పరిచయం తదితర ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. బ్యాంకాక్ పర్యటనలపై ఆరా తీశారు. బ్యాంకాక్ వెళ్లేది కథలు వినడానికా లేక డ్రగ్స్ కోణంలోనా అని అధికారులు అడిగారని తెలుస్తోంది.
Recommended Video
కెల్విన్తో సంబంధాలపైనే ఎక్కువగా..
కెల్విన్తో సంబంధాల పైనే పూరీని అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించారని తెలుస్తొంది. తొలి రౌండులోని 20 ప్రశ్నలకు పూరీ సమాధానం చెబుతుండగా.. మానసిక వైద్యుడు ఆయన తీరును గమనించారు. పూరీ 40 నిమిషాల పాటు తన వాదనలను వినిపించారని తెలుస్తోంది. కెల్విన్తో ఫోన్, వాట్సాప్ సందేశాల గురించి ప్రశ్నించారని సమాచారం.
అధికారులు వీరే... విచారణను వీడియో
పూరీ జగన్నాథ్ను విచారించే గదిలో ఒక డిఎస్పీ స్థాయి అధికారి, ఇద్దరు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, ఓ మానసిక వైద్యుడు, వీడియో గ్రాఫర్ ఉన్నారు. విచారణను వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
విచారణ తీరును ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ పర్యవేక్షించారు. సమాధానాలను నోట్ చేసుకునేందుకు అధికారిని ఏర్పాటు చేశారు. విచారణ తీరును లిఖిత పూర్వకంగా సిట్ రికార్డు చేస్తోందని తెలుస్తోంది.
సాయిరాం హల్చల్
రహస్యంగా జరుగుతున్న తన సోదరుడు పూరీ విచారణ గురించి అందరికీ తెలియజేస్తున్నారని ఆరోపిస్తూ సాయిరాం శంకర్ మీడియాపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అబ్కారీ శాఖ కార్యాలయంలో హంగామా చేశాడు. మీడియా ప్రతినిధులపైకి వెళ్లి, రిపోర్టర్ల సెల్ ఫోన్లు లాక్కొని వాటిల్లో కనిపించిన వీడియోలను చెరిపేశాడు. పూరీని విచారణ గదిలోకి తీసుకెళ్లిన అధికారులు, వీరిని మాత్రం బయటే ఉంచారు. ఆ సమయంలో తీసిన పలు వీడియోలు బయటకు వచ్చాయని అంటున్నారు.
కాగా, దీనికి హాజరయ్యే సెలెబ్రిటీలను ఏయే ప్రశ్నలు అడగాలి, ఎలాంటి సమాచారాన్ని రాబట్టాలి అన్నదానిపై అధికారులు ఇప్పటికే కసరత్తును పూర్తి చేశారు.
విచారణకు ఎవరు వస్తారు?
విచారణకు ఎవరు వస్తారు, ఎవరు హాజరుకారు అన్న విషయం మాత్రం ఇప్పటివరకు పూర్తిగా నిర్ధారణ కాలేదు. నోటీసులు అందాయని, విచారణకు హాజరవుతామని తరుణ్, నందు వంటివారు ప్రకటించారు. చార్మి, ముమైత్ వంటివారు హాజరుపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
సమాధానం చెప్పాలి
వారికి కేటాయించిన తేదీల్లో ఉదయం 10.30 గంటలకల్లా ఎక్సైజ్ కమిషనరేట్కు వచ్చి, సిట్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. డ్రగ్స్ కేసులో తమకు ఎంతవరకు సంబంధం ఉంది, అసలు సంబంధం ఉందా లేదా అన్న విషయాలను స్పష్టం చేయాలి.
గడువు పెంచారు
అయితే వీరిని 19వ తేదీ నుంచి 27 వరకూ విచారిస్తామని తొలుత తెలిపిన అధికారులు.. ఆ గడువును ఆగస్టు 1 వరకూ పొడిగించారు. 12మంది సినీ ప్రముఖులు ఉండడంతో గడువును పెంచాల్సి వచ్చిందని, వారిలో కొందరి తేదీలను సర్దుబాటు చేసే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు.
ముమైత్ ఖాన్ మినహా
సిట్ పంపిన నోటీసులు ఒక్క ముమైత్ఖాన్ మినహా మిగతా అందరికీ అందాయి. దీంతో ఎలాగైనా ఆమెకు నోటీసు అందచేసే ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు.