‘గాంధీ’లో పురుగుల సెలైన్ ఎక్కించారు: 62రోజులు పోరాడిన సాయిప్రవళిక మృతి
గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి మరో చిన్నారి బలైంది. దాదాపు రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడి మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది.
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి మరో చిన్నారి బలైంది. దాదాపు రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడి మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది. రెండు నెలల క్రితం గాంధీ ఆస్పత్రిలో కలుషిత(పురుగులు ఉన్న) సెలైన్ బాటిల్ ఎక్కించిన ఘటనలో బాధితురాలైన చిన్నారి సాయి ప్రవళిక(6) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది.
గత డిసెంబర్ 15న గాంధీ ఆస్పత్రిలో పురుగులు ఉన్న సెలైన్ ఎక్కించడంతో సాయి ప్రవళిక తీవ్ర అస్వస్థత గురైంది. దీంతో అక్కడే చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. 62 రోజులుగా చికిత్స పొందుతున్న సాయి ప్రవళిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతికి కారణమయిన వైద్య సిబ్బందిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మొదటి రోజు నుంచీ ఏం జరిగిందంటే..
జనగామ జిల్లా దేవర్పుల మోండ్రాయి గ్రామానికి చెందిన భిక్షపతి ఉప్పల్ డిపో వద్ద జీవిస్తూ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈయన చిన్న కుమార్తె సాయిప్రవళ్లిక(6) తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. ఈమెను డిసెంబర్ 7న గాంధీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చిన్నపిల్లల వార్డులో చేర్పించారు. క్రమంగా కోలుకుంటున్న ఈమెకు గురువారం(డిసెంబర్ 15న) ఉదయం ఏడు గంటల సమయంలో డెక్స్ట్రోస్ 10 రకం సెలైన్ బాటిల్ ఎక్కించారు. ఆ వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు ఈ బాటిల్ అమర్చారు.
పురుగులు పట్టిన సెలైన్ ఎక్కించడంతో.. బాలికకు సీరియస్
కాగా, అంతవరకు కులసాగా ఉన్న బాలిక శరీరంలో అరగంట తర్వాత తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. శరీరం దద్దుర్లతో ఎర్రగా మారిపోయింది. తర్వాత ఊపిరాడలేదు. అక్కడే ఉన్న తండ్రి బిడ్డ పరిస్థితి గమనించి ఆందోళనతో నర్సుకు సమాచారం అందించారు.
అనంతరం తండ్రే సెలైన్ బాటిల్ను గమనించగా, అందులో ఏదో పురుగు ఉన్నట్టు గుర్తించి నర్సుకు చెప్పాడు. దీంతో ఆమె వార్డులో ఎవరూ ఉండవద్దంటూ దబాయిస్తూ ఆ బాటిల్ను తొలగించి విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన తండ్రి సెలైన్ బాటిల్ను లాగేసుకున్నాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికరులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదు.
ఆ బిడ్డకు మెరుగైన వైద్యమందించడంలో ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఉదయం ఏడుగంటలకు ఘటన జరిగితే 12 గంటల వరకు వైద్యులు, వైద్యాధికారుల నుంచి స్పందనా లేదు. ఈ సమాచారం మీడియాకు తెలిసి.. టీవీల్లో కథనాలు రావడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు, వైద్యులు వార్డుకు వెళ్లి పరిశీలించారు.
మరో సెలైన్ బాటిల్ను ఇవ్వాలని ఆదేశించారు. శ్వాసతో ఇబ్బంది పడుతున్న ఆమెకు అత్యవసరంగా ఆక్సిజన్ సదుపాయం కల్పించారు. అప్పట్నుంచి చికిత్స పొందుతున్న సాయి ప్రవళిక సోమవారం తుది శ్వాస విడిచింది. కాగా, ఘటనపై డిపార్ట్మెంట్ విచారణ జరుగుతోంది.
సాయి ప్రవళిక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోంది: వైద్య సిబ్బంది
సాయి ప్రవళిక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోందని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నరాల వ్యాధితోపాటు నిమోనియా ఉండటం వల్లే ఆ చిన్నారి చనిపోయిందని చెప్పారు. ఆమెకు అవసరమైన వైద్యం అందించామని తెలిపారు.