‘సెక్సియస్ట్’ వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదు, సారీ అంటే సరిపోతుందా?: ఔట్లుక్పై హైకోర్టు ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్పై ఔట్లుక్ మ్యాగజైన్లో ప్రచురించిన వెగటు కథనాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఒక మహిళా అధికారి గురించి ‘సెక్సియస్ట్' అని పదాలను, ఇతర ఉద్దేశాలు ఆపాదించేలా కథనాలను ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. కార్టూన్లు వేసి ప్రచురించిన కథనాన్ని ఇంకా ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది.
‘మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఓవైపు ఇష్టానుసారంగా కథనాలు ప్రచురించి, తర్వాత సారీ అని చెబితే సరిపోతుందా? అంతమాత్రాన పరువు నష్టం దావా వేయకూడదా? పత్రికల్లో మీరు ప్రచురించే క్షమాపణను ఎంతమంది చూస్తారు?' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఔట్లుక్పై పరువునష్టం దావా వేయడానికి ప్రభుత్వం స్మితా సబర్వాల్కు రూ.15 లక్షలను కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలతోపాటు ఔట్లుక్ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై కూడా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసలే, జస్టిస్ ఎస్వీ భట్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కే రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిధులను విడుదల చేసిందని, ఈ మేరకు స్మితా సబర్వాల్ పరువునష్టం దావాను సైతం దాఖలు చేశారని తెలిపారు. ఔట్లుక్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఔట్లుక్ ప్రతినిధులపై స్మితా సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ సీసీఎస్ పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదును ఇటీవల సింగిల్ బెంచి కొట్టివేసిందని తెలిపారు.
పబ్లిక్ఫంక్షన్ వ్యవహారాలపై రాసిన కథనాల ఆధారంగా కేసును దాఖలు చేయడం సరికాదని, అయినా ఇప్పటికే తాము క్షమాపణలు చెప్పామని వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కార్టూన్లు వేసి ప్రచురించిన కథనాన్ని ఏవిధంగా సమర్థిస్తారు? కథనాన్ని చదివారా? అని ప్రశ్నించింది.
ప్రభుత్వం వివిధ కారణాలకు నిధులు విడుదల చేస్తుందని వాటన్నింటినీ సవాల్ చేస్తూ కేసులు దాఖలు చేస్తే ఎన్ని కేసులు అవుతాయని ప్రశ్నించింది. ‘నిధులు ఎందుకు కేటాయించాలో, ఎందుకు కేటాయించకూడదో ప్రభుత్వానికి తెలుసు. మనం చెప్పాల్సిన ఆవసరం లేదు' అని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన మూడు వ్యాజ్యాలను తాము విచారణకు స్వీకరిస్తున్నామని పేర్కొంటూ, కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.
ఇది ఇలా ఉండగా, హెల్మెట్ నిబంధన అమలుకాకపోవడంపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుల నమోదు కాదు.. తప్పనిసరిగా హెల్మెట్ను ధరించేలా చేయడమే తమ ఉద్దేశమని పేర్కొంది. హెల్మెట్ ధారణ మీద 2010లో దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. రెండు వారాల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది.