మూడు వేల ఓట్లా - ఠాగూర్ సమక్షంలోనే నేతల ఫైర్ : భట్టి వర్సెస్ రేణుకా చౌదరి - వార్నింగ్..!!
హుజూరాబాద్ బై పోల్ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి సమస్యగా మారింది. పార్టీ పరాజయం కంటే పార్టీకి వచ్చిన మూడు వేల ఓట్లు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు పార్టీ ఓట్లు ఏమయ్యాయనే ప్రశ్నలు మొదలయ్యాయి. రేవంత్ పైన గుర్రుగా ఉన్న సీనియర్లు కొందరు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ ఫలితాలకు తానే బాధ్యత తీసుకుంటున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణికంఠాగూర్ నేతృత్వంలో జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం వాడీవేడిగా జరిగింది.

పార్టీ ఓట్లు ఎవరికి వెళ్లాయి
హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు మూడు వేల ఓట్లు రావటం ఏంటి...2018 ఎన్నికల్లో పార్టీకి వచ్చిన 61 వేల ఓట్లు ఏమయ్యాయి... కాంగ్రెస్ ఓట్లు బీజేపీ అభ్యర్ధికి మళ్లాయా...అధికార టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లాయా అనే చర్చ ప్రధానంగా సాగింది. ఈ రెండు అంశాల ప్రాతిపదికగా సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఫలితాలను విశ్లేషించేందుకు కమిటీని ఏర్పాటుచేయాలని చివరిగా నిర్ణయించారు. సమావేశం ఆరంభంలోనే పలువురు నేతలు హుజూరాబాద్లో అభ్యర్థి ఎంపికపై చర్చను లేవనెత్తారు. స్థానిక నాయకులను కాదని, వేరే నియోజకవర్గం అభ్యర్థిని నిలపడం ఏమిటని ప్రశ్నించారు.

ఓటు బ్యాంకు కాపాడుకోలేకపోయామంటూ
అలాంటపుడు అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఎందుకు స్వీకరించారని నిలదీశారు. అభ్యర్థిని ముందుగా ప్రకటించకపోవడం కూడా నష్టం కలిగించిందని మరికొందరు అన్నారు. ఆరంభం నుంచి ఎన్నిక పట్ల శ్రద్ధ చూపలేదని, తెరాస, భాజపా పోరుగా చూడటం మినహా పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకునే దిశగా ప్రయత్నాలు జరగలేదంటూ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక అభ్యర్థికి టికెట్ ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేది కాదని వీహెచ్ సహా కొందరు అభిప్రాయపడగా, జిల్లా నేతలతో చర్చించిన తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేసినట్టు పీసీసీ ముఖ్యులు స్పష్టంచేశారు.

చర్చలు ఇక పార్టీ వేదికల పైనే
పార్టీకి సంబంధించిన అంశాలను అంతర్గతంగానే చర్చించుకోవాలని, బహిరంగ చర్చకు అవకాశం ఇవ్వవద్దని మాణికం ఠాగూర్ స్పష్టంచేశారు. తనవల్లే పార్టీకి నష్టం జరిగిందంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేసారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి మధ్య ఒక సందర్భంలో మాటల యుద్ధం జరిగినట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో భట్టి ప్రమేయం ఏమిటని ఆమె ప్రశ్నించారు. తాను ఏంచేయాలో, ఏం చేయకూడదో అధిష్ఠానం చెబుతుందని, పార్టీ బలోపేతానికి కృషిచేస్తే తప్పు ఎలా అవుతుందనంటూ భట్టి ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం.

క్రమశిక్షణా సంఘానికి కొత్త ఛైర్మన్
ఇక, తెలంగాణలో కొందరు నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ పైన ప్రత్యక్షంగా..పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఏఐసీసీ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి నియమించింది. వైస్ ఛైర్మన్గా రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంఏ ఖాన్, సభ్యులుగా ఎ.శ్యాంమోహన్, గడ్డం వినోద్, సౌదాగర్ గంగారాం, బి.కమలాకర్రావు, సీజే శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులిచ్చారు. ఇక, తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగానే టీఆర్ఎస్ ను దెబ్బ తీయటానికి పరోక్షంగా బీజేపీకి సహకరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు నియమించిన కమిటీ పూర్తి వివరాలతో రాష్ట్ర ఇన్ ఛార్జ్ కు నివేదిక ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications