సోనియాగాంధీ రావడంతో ప్రసంగం ఆపేసిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ను దులిపేసిన కోదండరాం
Recommended Video
హైదరాబాద్/మేడ్చల్: తెలంగాణలో నాలుగున్నరేళ్ల పాటు తెరాస అధినేత కేసీఆర్ అప్రజాస్వామికంగా పాలించారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ జరిగిన సోనియా గాంధీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా తెరాసపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రేవంత్ మాట్లాడుతుండగానే యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ వేదిక పైకి చేరుకున్నారు. ఆమెకు విజయశాంతి, గీతా రెడ్డిలు స్వాగతం పలికారు. సోనియా రావడంతో రేవంత్ తన ప్రసంగాన్ని ఆపేశారు. అంతకుముందు ఆయన మాట్లాడారు. ఆయన ప్రసంగానికి ముందే చప్పట్లతో సభా ప్రాంగణం హోరెత్తింది.
ఎంపీలే కాదు..వాళ్లూ వస్తారు, కేసీఆర్! ఎవర్ని బెదిరిస్తున్నావ్: రేవంత్, కేటీఆర్కు దిమ్మతిరిగే కౌంటర్
ఓట్లు అడిగేందుకు సోనియా రాలేదు
తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ చెప్పారు. ఆమె ఓట్లు అడిగేందుకు ఇక్కడకు రావడం లేదని చెప్పారు. నాలుగున్నరేళ్ల తెరాస అధినేత కేసీఆర్ పాలన అప్రజాస్వామికంగా సాగిందని చెప్పారు. ఓడిపోతే తాను అమెరికాకు వెళ్తానని కేటీఆర్, ఇంట్లో పడుకుంటానని కేసీఆర్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
రైతులకు భరోసా కల్పించేందుకు వచ్చారు
ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు ఇచ్చింది, ఆరోగ్యశ్రీ పథకం తీసుకు వచ్చింది కాంగ్రెస్ అని రేవంత్ చెప్పారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్ ఇవ్వలేదని చెప్పారు. రైతులకు భరోసా కల్పించేందుకే ఆమె వచ్చారని చెప్పారు. సోనియా గాంధీ ఎంత రుణం తీర్చుకున్న తక్కువేనని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అంటూ కోదండరాం
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సభలో మాట్లాడే అదృష్టం రావడం సంతోషమని కోదండరాం అన్నారు. రూ.5 భోజనం తిని చదువుకుంటున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, ఇసుక మాఫియాను అడ్డుకున్న వారిని జైలుకు పంపించారని కేసీఆర్ పైన ధ్వజమెత్తారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కనీసం 25వేలు కూడా ఇవ్వలేదని చెప్పారు. రుణమాఫీ ఎక్కడ జరిగిందో చెప్పాలన్నారు. ట్యాక్స్ తగ్గించారని ఆటో డ్రైవర్లు సంతోషించారని, కానీ అంతలోనే ఇన్సురెన్స్ పెంచి బాధపెట్టారన్నారు. ఈ నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలన నిరంకుశ పాలన అన్నారు. మన అదృష్టం కొద్ది కేసీఆర్ 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారన్నారు.
కేసీఆర్ చెప్పిన మాటలతో కౌంటర్
నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఓ మాట చెప్పారని, దానిని గుర్తు పెట్టుకోవాలని కోదండరాం అన్నారు. తనకు ఓటు వేసినా, వేయకపోయినా ఫాంహౌస్లో పడుకుంటానని చెప్పారని, అలాంటి వారికి ఎందుకు ఓటు వేయాలన్నారు. టీడీపీ, తెలంగాణ జన సమితి, కాంగ్రెస్, సీపీఐ ఒక్కటి కావడానికి నిరంకుశ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నిరంకుశ పాలనకు సమాధి కట్టేందుకు తాము కలిశామని చెప్పారు. ఉద్యోగాలు రావాలని, రైతులకు న్యాయం జరగాలని.. ఇవన్నీ జరగాలంటే కూటమి అధికారంలోకి రావాలని చెప్పారు. తాము సంఘటితంగా బయలుదేరామన్నారు. తెరాస గెలిచేందుకు రూ.కోట్లు వెదలజల్లుతోందని, కానీ తమ వద్ద అలా ఇచ్చేందుకు డబ్బులు లేవని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ తులాభారం కథను కోదండరాం చెప్పారు. డబ్బులతో శ్రీకృష్ణుడే తూగలేడని, తులసీదళంతో తూగాడని, ప్రజలకు ఇదే చెప్పాలనుకున్నామన్నారు. ఈ మధ్యన వరుసగా పర్వదినాలు వస్తున్నాయని, తెరాసను ఓడించేది కూడా పర్వదినం అవుతుందన్నారు.
సోనియా గాంధీ సభలో కీలక నాయకులు
ఈ సభకు ప్రజా యుద్ధ నౌక గద్దర్, తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి, ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ వచ్చారు. వేదికపై సోనియా గాంధీని గద్దర్ దంపతులు కలిశారు. నిర్మలా గద్దర్.. సోనియాకు చీరను బహుమతిగా ఇచ్చారు.