యాదాద్రిలో స్వామి స్వయంభువుల దర్శనం కోసం ప్రత్యేక కాంప్లెక్స్లు..
తెలంగాణలో ప్రసిద్ధచెందిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా యాదాద్రి నరసింహస్వామి ఆలయం ఒకటి. ఈ ఆధ్యాత్మిక ప్రదేశం తెలంగాణ తిరుపతిగా ఎంతో పేరుగాంచింది. ఈ ఆలయంలోని స్వామివారికి నిత్యం భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. తిరుమల తరహాలో ఇక్కడ కూడా స్వామి స్వయంభువుల దర్శనం కోసం ప్రత్యేక కాంప్లెక్స్లు ఏర్పాట్లు చేశారు.
ఈ ఆలయంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు వస్తున్నారు. దీంతో ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా ఇక్కడ కూడా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే భక్తులకు తిరుమల తరహాలో యాదాద్రీశుడి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. స్వామి స్వయంభువుల దర్శనం కోసం ప్రత్యేక కాంప్లెక్స్లను ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగానే స్వామివారిని మహాముఖ మండపంలో 26 అడుగుల దూరంలో ఉన్న వేదికపై నుంచి దర్శనం చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఇక, ఈ దర్శనాలను ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిన్న (బుధవారం జులై 10వతేదిన) ప్రారంభించారు. ఇక నుంచి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు మహాముఖ మండపంలో 26 అడుగుల దూరంలో ఉన్న వేదికపై నుంచి దర్శించుకోవచ్చు. ఇందుకోసం ఆలయంలో ప్రత్యేకంగా క్యూ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు 150 రూపాయల శీఘ్ర, ధర్మ దర్శన మార్గాలు గర్భగుడి వద్దకు చేరుకునే విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చినట్లు ఆలయ ఈవో ఈ సందర్భంగా ప్రకటించారు.
కొత్తగా అన్నప్రసాద సముదాయం..
నరసింహస్వామి వారి దర్శనం కోసం ఆయా క్యూలైన్లలో వచ్చే భక్తులను కొత్తగా ఏర్పాటు చేసిన క్యూ కాంప్లెక్స్ వద్దకు పంపిస్తారు. ఇక అక్కడి నుంచి మూలవరులను దర్శించుకోవచ్చు. ఈ విధానం ప్రస్తుతం తిరుమల ఆలయంలో అమలు చేస్తున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆలయం పశ్చిమ గోపురం నుంచి నేరుగా స్వామివారి దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు ఆలయంలో కొత్తగా అన్నప్రసాద సముదాయం కూడా నిర్మించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications