రేపు హైదరాబాద్ కు ప్రధాని - రెండు రోజుల బస : 4న ఏపీలో పర్యటన - షెడ్యూల్ ఇలా..!!
హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రంగం సిద్దమైంది. బీజేపీ చీఫ్ నడ్డా ఈ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రధాని మోదీ రేపు నగరానికి రానున్నారు. రెండు రోజుల ఆయన హైదరాబాద్ లోనే ఉండే విధంగా షెడ్యూల్ ఖరారైంది. జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత ప్రధాని ఏపీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇందు కోసం ప్రధాని బస - పర్యటన - భద్రతా ఏర్పాట్లు చేసారు. ప్రధాని షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్నాహ్నం 12 గంటల 45 నిమిషాలకు దిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రధాని బయలుదేరతారు.
ప్రధాని హైదరాబాద్ షెడ్యూల్
2 గంటల 55 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. 3 గంటలకు హెలికాప్టర్లో హెచ్ఐసీసీ నోవాటెల్ కి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పాల్గొననున్నారు. రాత్రి నోవాటెల్ హోటల్లోనే బస చేసే చేయనున్నట్లు తెలుస్తోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా జూలై 3వ తేదీన ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని హాజరవుతారు. సాయంత్రం వరకు సమావేశాల్లోనే పాల్గొంటారు. పార్టీ పరంగా భవిష్యత్ కార్యాచరణ పైన నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. సమావేశాలు ముగిసిన తరువాత సాయంత్రం సికింద్రబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో పాల్గొంటారు. ప్రధానితో పాటుగా పార్టీ ముఖ్య నేతలు ఈ బహిరంగ సభకు హాజరు కానున్నారు.
కేంద్ర మంత్రులు.. బీజేపీ సీఎంలు
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటుగా రాజ్ నాధ్ సింగ్ సైతం రేపు నగరానికి చేరుకుంటారు. ప్రధాని పాల్గనే విజయ సంకల్ప యాత్ర ను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దాదాపు 10 లక్షల మంది ఈ సభకు హాజరవుతారంటూ తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక, వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు అందరూ ఈ సభకు హాజరు కానున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని ఆశీనులయ్యే వేదిక పైన 8 మందికి స్థానం కల్పించనున్నారు. ప్రధాని ఉండే ప్రధాన వేదిక పైన అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ ఉండే అవకాశాలున్నాయి. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ
బహిరంగ సభ ముగిసిన తరువాత ప్రధాని రాజ్ భవన్ కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని పైన అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఇక, జూలై 4వ తేదీన ఉదయం 9.15 నిమిషాలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ గన్నవరం వెళ్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో భీమవరం చేరుకుంటారు. అల్లూరి సీతారామ రాజు 125 వజయంతోత్సవాల్లో పాల్గొంటారు. మధ్నాహ్నం తిరిగి ఢిల్లీకి బయల్దేరుతారు. ఇక, ప్రధాని తో పాటుగా కేంద్ర మంత్రులు.. దాదాపుగా 18 మంది ముఖ్యమంత్రులు పాల్గొనే ఈ సమావేశాల సమయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. దాదాపుగా 5 వేల మంది పోలీసు బలగాలను మొహరిస్తున్నారు.