బీజేపీ 'కొత్త' అనుమానం: పవన్ కళ్యాణ్ను బాబు నడిపిస్తున్నారా?
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ప్రకటన పైన రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తి, మరోవైపు వైసిపి అధినేత జగన్, ఇతర పార్టీలు ఎల్లుండి (శనివారం) బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన ఉంది.
ప్రత్యేక హోదా పైన ఆయన కాకినాడ సభలో ఏం మాట్లాడుతారు? ఎవరిని నిలదస్తారు? ఎల్లుండి బందుకు మద్దతు పలుకుతారా? హోదా లేదా ప్యాకేజీ విషయంలో తిరుపతి సభలో వలే కేవలం బీజేపీనే టార్గెట్ చేస్తారా? లేక చంద్రబాబును కూడా నిలదీస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇన్నాళ్లు టైం దొరికినప్పుడే
పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలికారు. ఆ తర్వాత రాజధాని భూములు, ప్రత్యేక హోదా.. తదితర విషయాల్లో ఆయన పెదవి విప్పారు. ఆయనకు సమయం దొరికినప్పుడు బయటకు వచ్చి ప్రభుత్వాలను నిలదీశారు. అయితే ఈసారి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, కాబట్టి పవన్ పూర్తిస్థాయి రాజకీయాలతో ప్రజల్లోకి వెళ్లాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆయనకు టైం వచ్చినప్పుడు బయటకు వస్తారని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇక నుంచి ఆయన పూర్తి సమయం కేటాయించాలని అంటున్నారు.

తిరుపతి వయా కాకినాడ..
ప్రత్యేక హోదా పైన తిరుపతి సభలోనే పవన్ బీజేపీని నిలదీశారు. అయితే, కాకినాడ సభ నుంచి జిల్లాలలో సభలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రత్యేక ఉద్యమంలోకి పవన్ వచ్చినట్లుగానే చాలామంది భావిస్తున్నారు. 2019 ఎన్నికల కోసమైనా అనుకోవచ్చు లేదా ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు న్యాయం చేసేందుకైనా అనుకోవచ్చు.. పవన్ హోదా పైన ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు.

నాటి ఎన్టీఆర్ నినాదం
ఇప్పటికే ప్రత్యేక హోదా ఏపీలో సెంటిమెంట్ అయింది. పవన్ కాకినాడ సభకు సీమాంధ్ర ఆత్మగౌరవ సభ అని నామకరణం చేశారు. నాడు 1982-83లలో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో టిడిపిని స్థాపించారు. ఇప్పుడు జనసేనను స్థాపించిన పవన్.. హోదా అనే సెంటిమెంటుతో ముందుకెళ్తున్నారని అంటున్నారు.

నాడు బీజేపీ ప్రకటించిన కాకినాడలోనే..
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం 1997లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ఎక్కడైతే పిలుపునిచ్చిందో అక్కడే పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవ సభ (కాకినాడ) పెడుతున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ పైన ఎన్టీఆర్ ఆత్మగౌరవం అంటే, నేడు బీజేపీ పైన పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం అంటున్నారు. హోదా పైన పవన్ గట్టిగా పోరాడితే 2019లో జనసేనకు ఎంతో భవిష్యత్తు ఉందంటున్నారు.

'పవన్' చంద్రబాబు అస్త్రమా?
పవన్ కళ్యాణ్.. చంద్రబాబు అస్త్రమని ప్రతిపక్ష వైసిపి నేతలు పలుమార్లు ఆరోపించారు. అయితే, ఇదే అనుమానం బీజేపీ నేతల్లో కొందరిలో ఉన్నట్లుగా కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అమరావతి భూముల వ్యవహారంలో చిక్కుల్లో ఉన్నప్పుడు, అలాగే, కాపు అంశం తెరపైకి వచ్చినప్పుడు పవన్ వచ్చి ప్రశ్నిస్తున్నారని, అప్పుడు ఆ అంశం పక్కదారి పడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తిరుపతి సభలో హోదా పైన బీజేపీని నిలదీసిన పవన్... చంద్రబాబును మాత్రం ఏమీ అనలేదని బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారంటున్నారు.

టిడిపి సంతోషం... బీజేపీకి మద్దతు, తప్పక సమర్థిస్తుందా?
కేంద్రాన్ని పవన్ ప్రశ్నించడాన్ని ఏపీ బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. హోదాపై అతను నిలదీస్తుంటే ప్రజల్లో సెంటిమెంట్ ఉన్న దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ మద్దతిస్తోందా అనే చర్చ సాగుతోంది. హోదాపై బీజేపీని నిలదీయడం పట్ల టిడిపి కూడా సంతోషంగానే ఉందని అంటున్నారు. కాకినాడ సభ ద్వారా చంద్రబాబును కూడా నిలదీస్తారా లేదా తేలుతుందని అంటున్నారు. కాగా, మీరు కేసులకు భయపడి హోదాపై నిలదీయడం లేదని అంటున్నారని పవన్ తిరుపతి సభలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications