ఇవాంక ఫలక్నుమా డిన్నర్: దృశ్యాల లీక్పై ఆరా, ఎస్పీజి ఆగ్రహం
హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జిఈఎస్)కు హాజరైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంక హైదరాబాదులోని ఫలక్నుమాలో విందుకు హాజరైన విషయం తెలిసిందే.
Recommended Video
భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ విందులో పాల్గొన్నారు. నిజానికి ఈ విందును ఇచ్చింది ప్రధానియే. అయితే, విందు సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విందుకు సంబంధించిన దృశ్యాలు టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. దానిపై ఎస్పిజీ మండిపడుతున్నట్లు సమాచారం.
అది భద్రతా ఉల్లంఘనే...
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సందర్భంగా ఇవాంకాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫలక్నుమా ప్యాలెస్లో ఇచ్చిన విందు సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కావడం భద్రత ఉల్లంఘనగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భావించినట్లు సమాచారం.
హైదరాబాదులో గట్టి భద్రతా ఏర్పాట్లు
ఇవాంకా పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఇవాంకా, మోదీల విందు దృశ్యాలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో తెలంగాణ పోలీసులకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైనట్లు చెబుతున్నారు.
వారిద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్న దృశ్యాలు
ఫలక్ నుమా విందు సందర్భంగా నవంబర్ 28వ తేదీ రాత్రి 9.42 గంటల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కెసిఆర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్న దృశ్యాలను తెలుగు టీవీ చానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రధాని కార్యాలయ అధికారులు ఎస్పీజీ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఎస్పీజీ అధికారుల ఆదేశంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు విందు దృశ్యాల ప్రత్యక్షప్రసారాన్ని ఆపించారు.
అవి ఎలా లీక్ అయ్యాయి...
విందు దృశ్యాలు టీవీ చానెళ్లకు ఎలా లీక్ అయ్యాయి అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేశారు. అవి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఉన్న నియంత్రణ కేంద్రం నుంచి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం జరిగిందని, దీనికి కొన్ని టీవీచానళ్ల మీడియా ప్రతినిధులకు అనుమతించారని తేలింది.