పసుపు బోర్డ్ చేసే పనే స్పెసెస్ బోర్డు చేస్తుంది, ఒకటి ఉండగా మరోటి ఎందుకు: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై మరోసారి తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నిజామాబాద్లో పసుపు బోర్డు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా మంగళవారం లోక్సభలో స్పష్టం చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన సమాధానమిచ్చారు. బోర్డు ఏర్పాటుతో వంగడాలపై పరిశోధనలు జరుగుతాయని పసుపు మార్కెటింగ్ మెరుగుపడుతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. పసుపు కోసమే ప్రత్యేకంగా బోర్డు పెట్టడం ద్వారా ఎన్నో లాభాలున్నాయన్నారు.

ఆ తర్వాత కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా సమాధానమిస్తూ.. పసుపు బోర్డు చేయాల్సిన పని నిజామాబాద్లో ఏర్పాటైన సుగంధ ద్రవ్యాల బోర్డు చేస్తుందని, అలాంటప్పుడు మరొకటి అవసరం లేదని స్పష్టం చేశారు. పేరు మాత్రమే వేరుగా ఉందని.. పసుపు బోర్డు చేసే అన్ని పనులు, అన్ని లాభాలు సుగంధ ద్రవ్యాల బోర్డుతో కలుగుతాయని వివరించారు. అందుకే మళ్లీ అలాంటి పనిచేసే పసుపు బోర్డు అవసరం లేదని చెబుతామన్నారు. కాగా, తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజ్యసభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఇది ఇలావుండగా, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. పసుపు బోర్డు కంటే మెరుగైన సుగంధ ద్రవ్యాల బోర్డు(స్పెసెస్ ఎక్సటెన్షన్ సెంటర్)ను ఏర్పాటు చేసినట్లు కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూర్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని అరవింద్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ తొత్తుగా మారిపోయారని, ఆయన రాసిచ్చిన లేఖను చదువుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు లొంగిపోయినట్లు కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications