తెలంగాణలో అమిత్ షా నింపిన స్పూర్తి..! బీజేపీలో టికెట్ల కోసం పెరుగుతున్న పోటీ..!!
హైదరాబాద్: తెలంగాణ బీజెపి నాయకుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్పుడూ లేని ఆసక్తిని చూపిస్తున్నారు నాయకులు. ఇప్పుడున్న స్థానాల్లో గెలిస్తే మహా ఎక్కువని సర్వేలు బీజేపికి ప్రతికూలంగా తేల్చి చెప్తున్నప్పటికి అవన్నిటిని లెక్క చేయడం లేదు బీజేపి నాయకులు. ఎన్నికల కదన రంగంలో ఎప్పుడు కాలు పెడదామా అని అస్త్ర శస్త్రాలతో సిద్దమైపోతున్నారు. పార్టీ టిక్కెట్ కేటాయించడమే తరువాయి ఎన్నికల బరిలో దిగేందుకు సై అంటున్నారు. తెలంగాణలో ఇంతలా ఆశావహుల సంఖ్య పెరిగిపోవడానికి అమీత్ షా తెలంగాణ పర్యటనలో నింపిన స్పూర్తే కారణమని పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది.

తెలంగాణ బీజెపిలో రెట్టింపైన ఉత్సాహం..! టికెట్ల కోసం మొదలైన కోలాహలం..!
తెలంగాణలో జరగబోయే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో టికెట్ల పోరు మొదలైంది. తమకు అనుకూలంగా ఉన్న స్థానాలను దక్కించుకునేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్కు క్యూ కడుతున్నారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ మద్దతు కూడగట్టేందుకు ఎవరికివారే పావులు కదుపుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మహాకూటమి ఏర్పాటుతో ఇక ఒంటరి పోరాటమే ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అమీత్ షా తో పాటు ప్రధాని మోదీ తెలంగాణలో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే ప్రజల మూడ్ మారే అవకాశాలు ఉంటాయని కూడా బీజేపి నేతలు చెప్పుకొస్తున్నారు.

అమీత్ షా నింపిన ఆత్మ స్థ్యైర్యం..! గెలుపు మనదే అంటున్న కమల దళం..!!
ఈ నేపథ్యంలో 119 స్థానాలల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధపడుతున్నారు. గెలిచే సామర్థ్యం లేకున్నా, కనీసం పోటీ చేయాలనే ఉత్సాహం చాలా మంది నేతల్లో నెలకొంది. గత 2014 సార్వత్రిక ఎన్నికలల్లో టీడీపీతో కలిసి పోటీ చేసినా గ్రేటర్లో 5 ఎమ్మెల్యేలు, ఒక్క ఎంపీ స్థానానికే బీజేపీ పరిమితమైంది. ప్రస్తుతం జరగబోయే ముందస్తు ఎన్నికలల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. ఇక తెలంగాణలో కలిసి వచ్చే పార్టీలు ఏమీ లేవని బీజేపీకి స్పష్టమైంది. దీంతో ఒంటరి పోరుకు సర్వం సిద్ధమని ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలల్లో పోటీ చేసి తమ సత్తా చాటుకోవాలని ఆ పార్టీ యువ నేతలు సై అంటున్నారు.

ఒంటరి పోరే కలిసొస్తుందంటున్న నేతలు..! సత్తా చూపేందకు సై అంటున్న నాయకులు..!!
అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకుల వ్యూహా ప్రతివ్యూహాలతో బీజేపీలో అంతర్గత రాజకీయాలు వెడెక్కాయి. బీజేపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనుంది. టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ అధిష్టానం గెలుపు గుర్రాలకే టికెట్లు కట్టబెట్టేందుకు కోసం నియోజవర్గాల వారీగా సర్వేలు జరిపిస్తోంది. సర్వేలో బలమైన నాయకులుగా తేలితేనే వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పలవురు నాయకులు చెబుతున్నారు.

అమీత్ షా, మోదీ పర్యటిస్తే పరిణామాలు మారతాయంటున్న బీజేపి నేతలు..!
అలాగే కాంగ్రెస్ జాబితా వెలువరించిన తర్వాతే బీజేపీ వారి జాబితా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో కాంగ్రెస్ టికెట్ దక్కని నాయకులు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉన్నందున ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు తమకున్న పరిచయాల ద్వారా అమిత్షాను కలిసేందుకు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలిసింది. తెలంగాణలో జరగబోయే ముందస్తు ఎన్నికలల్లో ఏ పార్టీతో పొత్తులుండవని, అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్ షా ప్రకటనతో ఆశావాహుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. తెలంగాణ బీజేపి నాయకుల్లో ఇంత ఊపు రావడానికి అమీత్ షా తెలంగాణ పర్యటన ఎంతగానో దోహదం చేసిందనే చర్చ కూడా సాగుతోంది.












Click it and Unblock the Notifications