సలేశ్వరం జాతరలో అపశృతి.. తొక్కిసలాట, పలువురికి గాయాలు
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అభయారణ్యంలో గల 'సలేశ్వరం లింగమయ్య జాతర' ముగిసింది. తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన ఈ వేడుకలో అపశృతి చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న జాతర చివరి రోజు కావడం.. అలాగే వారాంతం కూడా కావడంతో వేలాదిగా భక్తులు ఆలయాన్ని దర్శించేందుకు పోటెత్తారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా చెప్పుల కురవ ప్రాంతం దాటి వెళ్తున్న ఇరుకు మార్గంలో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో స్వల్ప తోపులాట జరిగిందని తెలుస్తోంది.
ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. ఒక చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందుతోంది. ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు చెబుతున్నారు. అంతే కాకుండా ఓ భక్తుడిపై పైనుంచి బండరాయి పడటంతో తలకు గాయమైందని వాపోతున్నారు. గాయపడిన వారికి చికిత్స అందించినట్టు వైద్యులు చెబుతున్నారు.

తక్కువ సమయంలోనే అధిక సంఖ్యలో భక్తులు జాతరకు చేరుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అయితే తగిన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ గందరగోళం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరెన్నడూ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications