గురువారం తుది జాబితా.. 90.72 కోట్లు సీజ్.. కోడ్ ఉల్లంఘనపై కేసులు : ఈసీ సీఈవో
Recommended Video
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల కోసం పోటీపడుతున్న అభ్యర్థుల తుది జాబితా గురువారం ప్రకటిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. రాష్ట్రవ్యాప్తంగా 3,583 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. వీటిని పరిశీలించడంతో పాటు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ వెల్లడిస్తామన్నారు.
సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రజత్ కుమార్ ఎన్నికలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. కొత్త ఓటర్ల నమోదుకు అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా తరలిస్తున్న 90 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పెరిగిన ఓటర్లు, పోలింగ్ సెంటర్లు
కొత్త ఓటర్ల నమోదుకు అనూహ్య స్పందన లభించిందన్నారు రజత్ కుమార్. 7 లక్షల 46 వేల 81 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే పెరిగిన ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు పెంచినట్లు చెప్పారు. ఇంతకుముందు 32,574 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అదనంగా 222 పెంచడంతో ఇప్పుడు వాటి సంఖ్య 32,796కు పెరిగిందన్నారు. ఈనెల 23న బ్యాలెట్ పేపర్ ముద్రిస్తామన్న రజత్ కుమార్.. డిసెంబర్ 1 వరకు ఓటర్ స్లిప్పులు, ఎపిక్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు లక్షా 60 వేల 509 మంది రెవెన్యూ సిబ్బందితో పాటు 30వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని చెప్పారు. అదనంగా కేంద్ర బలగాలను కూడా రప్పిస్తున్నామని తెలిపారు.
డబ్బుల వరద.. 90.72 కోట్లు సీజ్
ఎన్నికల కోడ్ మొదలు ఇప్పటివరకు రూల్స్ అతిక్రమించి తరలిస్తున్న 90.72 కోట్ల మొత్తాన్ని సీజ్ చేశామన్నారు. అందులో 77.38 కోట్ల నగదు, 5.79 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 7.55 కోట్ల మద్యం ఉన్నాయన్నారు. అలాగే 9,656 లైసెన్స్డ్ తుపాకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 4,966 బెల్టు షాపులు సీజ్ చేయడమే గాకుండా 4,351 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
కోడ్ ఉల్లంఘనపై కేసులు, నోటీసులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత వీహచ్ పై కేసులు నమోదు చేశామన్నారు. సికింద్రాబాద్ లో ఓ వర్గాన్ని ప్రలోభపెట్టారనే ఆరోపణలపై గోపాలపురం పీఎస్ లో కేసు నమోదుచేశామన్నారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణతో పాటు కేసు వివరాలను సెంట్రల్ ఈసీకి నివేదిస్తామన్నారు. కార్వాన్, బహదూర్ పురా పీఎస్ లలో వీహెచ్ పై కేసులు నమోదయినట్లు తెలిపారు. వీటిపై వీహెచ్ వివరణ తీసుకున్నాక తదుపరి చర్యలుంటాయన్నారు. అటు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాపరెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.
గురువారం రాష్ట్రానికి రావత్ టీమ్
ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ గురువారం రాష్ట్రానికి రానున్నారు. ఇక్కడి ఎన్నికల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. కోడ్ ఉల్లంఘనలను సమీక్షించనున్నట్లు సమాచారం. రావత్ తో పాటు కేంద్ర ఎన్నికల కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావాస కూడా వస్తారని తెలుస్తోంది.