సభ, పాదయాత్రపై కేసీఆర్, టీఆర్ఎస్ కుట్రలు: బండి సంజయ్ చురకలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లోనే ప్రజా సంగ్రామ యాత్రను ఆపే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకనే టీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై వస్తున్న లిక్కర్ స్కాం ఆరోపణలను మభ్యపెట్టేందుకే కుట్రలు చేస్తున్నారన్నారు.

టీఆర్ఎస్ కుట్రలంటూ బండి సంజయ్
త్వరలోనే లిక్కర్ స్కాం ఆరోపణలు బయటకొచ్చే అవకాశాలున్నాయని బండి సంజయ్ అన్నారు. పాదయాత్రలో అల్లర్లు సృష్టించి కోర్టు అనుమతి రాకుండా చూడాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. యాత్ర ముగింపు సభను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నాయకులు అనేకపాట్లు పడ్డారన్నారు.
గౌరవ హైకోర్టు సభకు అనుమతిచ్చిందని బండి సంజయ్ అన్నారు. ధర్మం గెలిచిందన్నారు. ఇప్పుడేమో వరంగల్ సీపీ.. సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని ప్రకటనలు చేస్తున్నాడని మండిపడ్డారు. 30 సిటీ యాక్ట్ ఆదేశాల పత్రాలను సీపీ, సీఎం కేసీఆర్ ల్యామినేషన్ చేసుకుని ఆఫీసులో పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.

కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం: బండి సంజయ్
కోర్టును తప్పుదారి పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని బండి సంజయ్ మండిపడ్డారు. సభ కోసం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ ను ముందే బుక్ చేసుకున్నా.. పై నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ప్రిన్సిపల్ అనుమతి రద్దు చేస్తామని చెప్పారని అన్నారు. సభ ఏర్పాట్లు 90 శాతం పూర్తైనట్లు చెప్పిన సంజయ్.. తన పాద యాత్ర సాయంత్రానికి భద్రకాళి ఆలయానికి చేరుకుంటుందని చెప్పారు. జేపీ నడ్డాతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకుని సభాస్థలికి వెళ్తామని ప్రకటించారు.

బీజేపీ సభను కేసీఆర్ చూడాలంటూ బండి సంజయ్
శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే సాకుతో పోలీసులు ఆంక్షలు విధించారని బండి సంజయ్ మండిపడ్డారు. బహిరంగ సభకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారని.. సీఎం కేసీఆర్ తమ సభను చూడాలని సూచించారు. నిర్భంధాలకు వ్యతిరేకంగా కార్యకర్తలు తరలివస్తున్నారన్నారు. పాదయాత్రలో పోలీసులు జరిపిన లాఠీఛార్జీలో ముగ్గురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని, వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం సాగుతుందన్నారు. శనివారం నాటి బహిరంగ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాగా, బీజేపీ జాతీయ నేత సునీల్ బన్సల్ హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రే వరంగల్ కు బయల్దేరారు సునీల్ బన్సల్.












Click it and Unblock the Notifications