రైతుల కష్టాన్ని కాపాడిన విద్యార్థులు... వాళ్ళు చేసిన పనికి అందరూ ఫిదా!!
ఆరుగాలం శ్రమించి ఎంతో కష్టం చేసి అన్నదాతలు పంటలు పండిస్తే, వారి చెమట చుక్కలతో పండిన ధాన్యం తో మనం కడుపు నింపుకుంటున్నాం. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్నను గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దేశానికి వెన్నెముక అయిన రైతును ఎవరూ గుర్తించటం లేదు. రైతన్నలు కష్టాల్లో ఉంటే చిన్నపాటి సాయం చేసి ఆదుకునే వారు కూడా లేరు. అన్నదాతలు పడే ఇబ్బందులను కళ్ళ ముందు చూస్తున్నా మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్ళిపోయే వారు ఉన్న నేటి రోజుల్లో, ఒక స్కూల్ విద్యార్థులు ఓ అన్నదాతకు అండగా నిలవడం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.
ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం .. అకస్మాత్ వర్షంతో అన్నదాతల ఆందోళన
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇక ఇదే సమయంలో వరి చేల కోతలు కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేర్చిన రైతులు, ధాన్యం అమ్ముకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా దోమలపల్లి గ్రామంలో రైతులు స్థానిక ఐకెపి కేంద్రాల్లో తమ వరి ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. ఈ సమయంలో హఠాత్తుగా వర్షం పడడంతో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి పోతున్న పరిస్థితులలో రైతులు ఆందోళన చెందుతూ వాటిపైన ధాన్యం తడిసి పోకుండా ప్లాస్టిక్ పరదాలను కప్పి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
ధాన్యం తడిసిపోకుండా కాపాడిన విద్యార్థులు
అది చూసి అటుగా వెళుతున్న స్కూల్ విద్యార్థులు రైతుల కష్టం నీటిపాలు కాకుండా ఐకెపి సెంటర్లో ఉన్న ధాన్యం కుప్పలు అన్నింటిపై ప్లాస్టిక్ పరదాలను కప్పి వాటిని కాపాడారు. ఒక పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు రైతుల ధాన్యాన్ని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్దిగా ఆలస్యం అయ్యుంటే పంట మొత్తం తడిసి పాడైపోయేదని, విద్యార్థులు చేసిన సహాయం చాలా గొప్పది అని అక్కడ ఉన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతన్నలకు సాయం చేసిన విద్యార్థులకు ప్రశంసలు
ఎవరు ఏమైపోతే మాకేంటి? అని పక్కవారి గురించి పట్టించుకునే పరిస్థితి లేని నేటి రోజుల్లో, కష్టాన్ని చూసి సాయం చేసిన విద్యార్థులు ఇప్పుడు అందరినీ ఆలోచించేలా చేస్తున్నారు. ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సాయం చేసే విషయంలో ప్రతి ఒక్కరూ మేము సైతం అంటూ ముందుకు రావాలన్న సందేశాన్ని స్కూల్ విద్యార్థులు అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఆరుగాలం శ్రమించి అన్నదాత పండించిన పంటను కాపాడి ప్రతి ఒక్కరి తో శభాష్ అనిపించుకుంటున్నారు ఈ చిన్నారులు.