బాత్రూం నుంచి ఈడ్చుకొచ్చి, వివస్త్రగానే దాడి: జైల్లో సుశృత మామ మృతి
హైదరాబాద్: ఇటీవల అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసిన వివాహిత సుశృత ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె మామ శంకర్ రావు ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన ఆదివారం ఉదయం గుండెపోటుకు గురయ్యాడు.
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పూసలబస్తీకి చెందిన సుశృతను వాటర్ హీటర్ ఎక్కువసేపు వాడిందనే నెపంతో వారం రోజుల క్రితం ఆమె భర్త తీవ్రంగా కొట్టాడు. బాత్రూంలో ఉన్న ఆమెను అలాగే ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి తీవ్ర కొట్టాడు. ఎంత వేడుకున్నా కనికరం చూపకుండా కుటుంబసభ్యుల ముందే దాడి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అంతకుముందు వాట్సప్లో తన తండ్రికి మెసేజ్ పెట్టింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. తమ కూతురు మరణానికి కారణమైన భర్త, అత్తామామలు, వారి కుటుంబసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.
కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తతో పాటు మామ శంకర్రావును అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం శంకర్రావు గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications