లైంగిక దాడి, స్వాతి హత్యపై అనుమానాలు: వారి పనేనా?
కరీంనగర్: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాలకు చెందిన దారం స్వాతి అనే విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె హుజురాబాద్లోని చెట్ల పొదల్లో శవమై తేలింది. హత్య చేయడానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు చెబుతున్నారు.
ఆ సంఘటన వెనక ఒకరి కన్నా ఎక్కువ మంది ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీన హుజురాబాదులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో స్వాతి మృతదేహం కనిపించింది.
స్వాతి వరంగల్ జిల్లా కొత్తగుడా మండలం బావురుకొండ నివాసి. ఆమె ఆచూకీ కోసం గాలిస్తుండగా రెండు రోజుల్లో ఆమె పర్సులో లభించిన పాస్పోర్టు ఫోటోల ఆధారంగా పసిగట్టారు. అయితే, భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాలలో బిఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి హుజురాబాద్ ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, ఎవరు తీసుకుని వచ్చారు వంటి పలు విషయాలను పోలీసులు ఆరా తీశారు.
ఈ నెల 12, 13, 14 తేదీల్లో హుజురాబాదులోని ఉన్నత పాఠశాల మైదానంలో తెలంగాణ స్థాయి ఫుట్బాల్ పోటీలు జరిగాయి. 12వ తేదీ సాయంత్రం ఇక్కడికి భద్రాచలం ఫుట్బాల్ క్రీడాకారులు వచ్చారు. 13వ తేదీ ఉదయం జరిగిన మ్యాచులో భద్రాచలం జట్టు ఓటమి పాలైంది. దీంతో వారు తిరుగు ముఖం పట్టారు.
అదే రోజు స్వాతి హత్యకు గురైంది. దీంతో స్వాతి హత్యతో ఫుట్బాల్ క్రీడాకారులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. పైగా, స్వాతికి చెందిన బ్యాగ్ ఖమ్మం జిల్లా కొత్తగూడెం బస్టాండులో ఉంది. ఇంట్లోంచి ఏ దుస్తుల మీద బయటకు వెళ్లిందో అదే డ్రెసులో హత్యకు గురైంది.
స్వాతిని భద్రాచలం నుంచి అహహరించి, ఇక్కడికి తెచ్చి లైంగిక దాడి చేసి, హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనుమానం రాకుండా కరీంనగర్ నుంచి హుజురాబాద్కు వచ్చినట్లు బస్సు టికెట్ను తన పర్సులో పెట్టి ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.