ఫలకునుమా ప్యాలెస్లో బస చేయనున్న ఇవాంకా ట్రంప్
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లో బస చేయనున్నారు. ఈ ఏడాది నవంబర్లో హైద్రాబాద్లో జరిగే గ్లోబల్ ఎంటర్ప్రైన్యూర్స్ సమ్మిట్లో ఆమె పాల్గొననున్నారు.
అమెరికా నుండి వచ్చే ప్రతినిధి బృందానికి ఇవాంకా ట్రంప్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. ఈ సమ్మేళనంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3వేల మంది ప్రతినిధులు సుమారు 150 దేశాల నుండి హజరౌతారని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ఏడాది నవంబర్ 28వ, తేది నుండి మూడు రోజుల పాటు ఈ సమ్మేళనం జరుగుతోంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ఈ సమ్మేళనం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ సమ్మేళనానికి సంబంధించి ఐటీ, పరిశ్రమలు, జిహెచ్ఎంసి అధికారులు సమన్వయంతో చేస్తున్నారు. 60 దేశాల నుండి 1200 మంది ఈ సమావేశానికి హజరుకానున్నట్టుగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది.
ఈ సమ్మేళనంలో ఎక్కువగా మహిళ పారిశ్రామికవేత్తలు వచ్చేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వారికి అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చే ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ సదస్సుకు అమెరికా ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది ఇండియా.
మూడురోజుల ఈ భాగస్వామ్య సదస్సులో 12 వర్క్షాప్, సమీక్షలు, డిబేట్స్ హెచ్ఐసిసిలో ఏర్పాటుచేశారు. హైద్రాబాద్లోని ఫైవ్స్టార్ హోటల్స్లో రూమ్లను బుక్ చేశారు. ప్రభుత్వ అతిధిగృహలను కూడ రిజర్వ్ చేశారు.
ప్రధాని మోడీ, ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లు రానున్నారు. అయితే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను కేంద్రం ప్రకటించే అవకాశం లేకపోలేదని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.