డిమోషన్ కాదు, డామినేషన్ లేదు, కెసిఆర్ చెబితే అంతే: అరకు ఎంపీపైనా తలసాని
హైదరాబాద్: తన శాఖ మార్పు ప్రమోషనే కానీ, డిమోషన్ కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. వాణిజ్య శాఖలో తాను ఫెయిల్ కాలేదని తేల్చి చెప్పారు. మంత్రుల శాఖను మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని చెప్పారు. తాజా శాఖను కేటాయించి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తనకు మరింతగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కల్పించారని అన్నారు.
మంత్రి తలసాని ఓ మీడియా ఛానెల్తో ఈ మేరకు మాట్లాడారు. సెటిల్మెంట్లతో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. జువెల్లరీ షాపుల నుంచి గిఫ్టులు ఇచ్చారనడం వాస్తవం కాదని అన్నారు. మంత్రి అయ్యేముందే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తెలిపారు.
కబ్జాలు చేస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదని, తన కుటుంబం గజం స్థలం బలవంతంగా తీసుకున్నా.. ఏ శిక్షకైనా సిద్ధమని మంత్రి తలసాని స్పష్టం చేశారు. అధికారుల బదిలీలతో కూడా తనకు సంబంధం లేదని చెప్పారు. తన హయాంలో ఒక్క బదిలీ కూడా జరగలేదని తెలిపారు.
అరకు ఎంపీ విషయంలో తన కుమారుడిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాజ్కృష్ణ హోటల్లో బంధించడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. పనిపాటలేని వ్యక్తి గురించి మాట్లాడటం అవసరం లేదని శశిధర్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా స్పందించారు.
కాగా, వాణిజ్యశాఖతో జిల్లాల్లోకి వెళ్లే పరిస్థితి, అవసరం రాలేదని మంత్రి తలసాని చెప్పారు. అందుకే ప్రజలతో మమేకమయ్యే శాఖను తనకు సీఎం కేటాయించారని చెప్పారు. కేబినెట్ శాఖల మార్పు సీఎం ఇష్టమని ఆయన చెప్పారు.
కేసీఆర్ ఏం చెబితే అదే ఫైనల్ అని, అందరూ ఆయన మాట వింటారని చెప్పారు. ఎవరైనా పార్టీలో చేరేటప్పుడే అందరితో కలిసి ముందుకు వెళ్లాలని సీఎం చెప్తారని తెలిపారు. మంత్రులందరూ ఒక్కటేనని, అందరం కలిసే పని చేస్తుంటామని చెప్పారు.
మంత్రి పద్మారావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తామిద్దరం కలిసే పని చేస్తున్నామని చెప్పారు. డామినేషన్ లాంటివేం లేవని చెప్పారు. కిందిస్థాయిలో గెలిచేవారికే టికెట్లు కేటాయించామని, నామినేటెడ్ పదవుల్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని ఆరోపణలు వస్తున్నాయని ప్రశ్నించగా.. ఐడిఎల్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించామని, కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు తెస్తున్నామని, స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టామని, నూతన మార్కెట్లు, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రాధాన్యత తగ్గించారని చెప్పుకోవచ్చా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని చెప్పారు తలసాని. తన ప్రాధాన్యత ఒక శాతం కూడా తగ్గలేదని మంత్రి తెలిపారు. తాజాగా ఇచ్చిన శాఖతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం వచ్చిందని తెలిపారు.
టిఆర్ఎస్ ప్లీనరీలో తను వాలంటరీగా మాట్లాడానని, తనకు అవకాశం కల్పించడంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన తనకు మంత్రి పదవితో సీఎం గౌరవించారని తెలిపారు.