వరంగల్లో మేమే పోటీ చేస్తామంటున్న టిడిపి: అభ్యర్థి ఖరారు కాలేదని కిషన్ రెడ్డి
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్థిపై ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దించాలని తెలుగుదేశం, బిజెపిలు నిర్ణయించాయి. అయితే, వరంగల్ లోకసభ స్థానంలో తాము పోటీ చేస్తామని టిడిపి నాయకులు బిజెపికి ప్రతిపాదన చేశారు. అయితే, అభ్యర్థి నిర్ణయం ఇంకా జరగలేదని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. వరంగల్ లోకసభ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ టిడిపి, బిజెపి నాయకులు శనివారం సమావేశమై చర్చించారు.
టిఆర్ఎస్కు బిజెపి, టిడిపి కూటమే ప్రత్యామ్నాయమని సమావేశానంతరం బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మీడియాతో అన్నారు. వరంగల్లో తమ కూటమి అభ్యర్థి విజయం సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని, అన్ని రంగాల్లో విఫలమైందని, అన్ని వర్గాల్లోనూ టిఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి పేరుకుపోయిందని ఆయన అన్నారు.

బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థి గెలిస్తే వరంగల్ లోకసభ నియోజకవర్గం అభివృద్ధికే కాకుండా తెలంగాణ అభివృద్ధికి ఉపయోగం కలుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసును పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. టిఆర్ఎస్ గెలిస్తే 11 మందికి మరో సభ్యుడు అవుతాడే తప్ప ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. ప్రజల్లో టిఆర్ఎస్పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బిజెపి, టిడిపి కూటమి ఎదగాలని తాము అనుకున్నామని ఆయన చెప్పారు.
విజయం సాధిస్తామనే విశ్వాసంతో తాము అభ్యర్థిని పోటీకి దింపుతున్నామని, కమిటీలను ఏర్పాటు చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో పని చేస్తామని, వరంగల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు చాలా మంది ఉన్నారని, ఎవరైతే బాగుంటుందో చూసి నిర్ణయిస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో టిడిపి, బిజెపి కూటమి బలమైన శక్తి అని చాటి చెప్పడానికి వరంగల్ లోకసభ ఉప ఎన్నిక మంచి అవకాశమని టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. ఫామ్ హౌస్ను దాటి తెలంగాణ ప్రభుత్వం పాలన కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్పై ప్రజల ఆశలు సన్నగిల్లాయని తెలంగాణ టిడిపి నాయకుడు రావుల చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఎన్టీఆర్భవన్లో రావుల మీడియాతో మాట్లాడారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తమ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారన్నారు. గతంలో మెదక్ లోక్సభ, రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము బీజేపీకి మద్ధతు ఇచ్చామని చెప్పారు. మిత్ర ధర్మం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్పై ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. మోదీ, చంద్రబాబులపై నమ్మకంతో ప్రజలు తమను గెలిపిస్తారని రావుల వివరించారు.












Click it and Unblock the Notifications