చంద్రబాబుది యూజ్ అండ్ త్రో పాలసీ: టీడీపీని నమ్ముకున్నందుకు అప్పులపాలు: పార్టీ నేత ధర్నా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సొంత పార్టీకే చెందిన నాయకుడొకరు ఘాటు విమర్శలు గుప్పించారు. ఆరోపణలను సంధించారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ధర్నాకు దిగారు. బైఠాయించారు. ఇదంతా చోటు చేసుకున్నది ఎక్కడో కాదు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసం ముందే. ఆ నాయకుడి పేరు వెంకటేశ్వర రావు. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లాకు చెందిన నాయకుడు. ఇదివరకు జూబ్లీహిల్స్ కార్పొరేటర్గా పోటీ చేసి, ఓడిపోయారు.
జగన్ సర్కార్పై కంప్లయింట్: ఆ రెండు అంశాలే ప్రధానంగా: గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చాలాకాలం నుంచీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో కుటుంబంతో సహా ఉంటున్నారు. పార్టీని అక్కడి నుంచే నడిపిస్తున్నారు. ఏపీ రాజకీయాలపై జూబ్లీహిల్స్ నివాసం నుంచే సమీక్షలను నిర్వహిస్తున్నారు. చంద్రబాబును కలుసుకోవడానికి తెలంగాణ టీడీపీకి చెందిన నాయకులు తరచూ నివాసానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వర రావు ఈ ఉదయం చంద్రబాబును కలుసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది లోనికి రానివ్వలేదు.
చంద్రబాబుకు ముందే సమాచారం ఇచ్చానని, తానను రమ్మన్నారని వెంకటేశ్వర రావు చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. ఎవరినీ రానివ్వొద్దని ఆయనే తమకు ఆదేశాలను జారీ చేసినట్లు భద్రతా సిబ్బంది సూచించారు. వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీనితో వెంకటేశ్వర రావు ఆగ్రహానికి గురయ్యారు. చంద్రబాబు ఇంటి ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. నిరసన తెలిపారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు. 30 సంవత్సరాలుగా తాను పార్టీలో పనిచేశానని, ఇప్పుడు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రమ్మని చెప్పి మరీ.. లోనికి పంపించడానికి అనుమతి ఇవ్వలేదని అన్నారు.
చంద్రబాబును కలుసుకోవడానికి తాను రెండువారాలుగా ప్రయత్నిస్తున్నానని అన్నారు. వారికి ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వట్లేదని, మెసేజీలు పెట్టినా బదులు రాలేదని చెప్పారు. చంద్రబాబు తనను వాడుకుని వదిలేశారని అన్నారు. వ్యక్తులను వాడుకోవడం , వదలివేయడం చంద్రబాబుకు అలవాటై పోయిందనే విషయం ఆలస్యంగా తనకు తెలియ వచ్చిందని ఆరోపించారు. చంద్రబాబుది యూజ్ అండ్ త్రో పాలసీ అని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును నమ్ముకుని తాను అప్పులపాలయ్యానని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జీవితాలతో ఆడుకోవడం తప్ప న్యాయం చేయట్లేదని ఆరోపించారు. తనకు జరిగిన అవమానం మరో కార్యకర్తకు జరక్కూడదనేదే తన ఆవేదన అని అన్నారు. చంద్రబాబును నమ్ముకోవడం వల్ల ఒంటిపై బట్టలు తప్ప తనకేమీ మిగల్లేదని ధ్వజమెత్తారు. అవసరం ఉన్నన్ని రోజులూ తన భుజంపై చేతులు వేసి చంద్రబాబు మాట్లాడారని, ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు.
చంద్రబాబుది యూజ్ అండ్ త్రో పాలసీ: టీడీపీని నమ్ముకున్నందుకు అప్పులపాలు: పార్టీ నేత ధర్నా #Tdp #Chandrababu #Hyderabad pic.twitter.com/97n3JDkIWY
— oneindiatelugu (@oneindiatelugu) July 20, 2020