తలసాని ఇష్యూ: ఇప్పుడు కాదని టిడిపికి గవర్నర్ ఝలక్, అరెస్టు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం నాడు గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన వారు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్ పైన గెలిచిన తలసాని రిజైన్ చేయకుండానే రాజ్యాంగ విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నారన్నారు.
తన పదవికి రాజీనామా చేశానని చెప్పి మోసం చేసిన తలసానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్ను వారు కోరారు. దీనిపై గవర్నర్ స్పందించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కోర్టు పరిధిలో ఉందని, దానిపై తాను ఇప్పుడు స్పందించలేనని చెప్పారని తెలుస్తోంది.
ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో మీరు ఫైలును తిప్పి పంపినప్పుడు మిమ్మల్ని అందరూ మెచ్చుకున్నారని, అదే రీతిలో ఇప్పుడు కూడా తలసాని పైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్తో రావుల చంద్రశేఖర రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. ఫిరాయింపుల రాజ్యాంగ నిబంధనల కాపీని గవర్నర్కు ఇచ్చారు.

రాజ్ భవన్ వద్ద ధర్నా
గవర్నర్ను కలిసిన అనంతరం, తెలంగాణ టిడిపి నేతలు రాజ్ భవన్ వద్ద ధర్నాకు దిగారు. గవర్నర్ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వారు దర్బార్ హాలు బయట బైఠాయించారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం వారిని అరెస్టు చేశారు.
కాగా, అంతకుముందు తలసాని మాట్లాడుతూ.. తన వెంట పడితే ఎవర్నీ వదిలి పెట్టే సమస్య లేదని హెచ్చరించారు. తనకు రాజకీయ అనుభవం లేనట్లు మాట్లాడటం సరికాదన్నారు. నాలుగుసార్లు ప్రజాప్రతినిధిగా, మూడుసార్లు మంత్రిగా పని చేశానన్నారు. తన పైన రోజుకొకరు గవర్నర్, రాష్ట్రపతి వద్దకు వెళ్లి డ్రామాలాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications