రేవంత్ రెడ్డికి షాక్: చెక్ పెడుతున్న సొంత పార్టీ నేతలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచే కష్టాలు ఎదురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన తెలంగాణ యాత్రకు వారు చెక్ పెట్టేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ టిడిపి నేతలు రాష్ట్రంలో కరవు యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు భావిస్తున్నారు.
తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఆదిలాబాద్ నుంచి ఆమనగల్ వరకు ఆయన పాదయాత్ర చేస్తానని చెప్పారు. అయితే, తెలుగుదేశం పార్టీ నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు.
వారు కరువు యాత్ర చేపట్టి రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కరువు యాత్రతో రేవంత్ రెడ్డి పాదయాత్ర జరిగే అవకాశాలు లేవని అంటున్నారు. అసలు అయన పాదయాత్ర జరుగుతుందో లేదో సందేహంగానే ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడానికని టిడిపి నాయకులు బయటకు చెబుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకోవడం కూడా వారి ఉద్దేశమని అంటున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదగాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అది తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదని అంటున్నారు.