రహస్యంగా యువతుల ఫోటోలు తీసి, ఫేస్బుక్లో పెట్టి వేధింపు
హైదరాబాద్: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఒకతను.. యువతుల పేరిట ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, వారిని రహస్యంగా ఫోటోలు తీసేవాడు. వాటిని ఆ ఫేస్బుక్ పేజీలో పెడుతుంటాడు. అతనిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
అతను యువతులకు మాయమాటలు చెప్పి రహస్య కెమెరాలతో వారి ఫొటోలు తీసి, ఫేస్బుక్ ప్రొఫైల్స్లో పోస్ట్ చేసి వేధింపులకు గురి చేస్తుంటాడు. ఆ యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు సాయి శంతన్. వయస్సు 22.
మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్కు చెందిన సాయి శంతన్ నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. స్నేహం పేరిట యువతులను పరిచయం చేసుకుంటుంటాడు. రహస్య కెమెరాతో వారి ఫొటోలు తీసి వివిధ రకాలుగా బాధితులను వేధిస్తున్నాడు.
వారి పేరిటే ఫేస్బుక్ ఖాతా సృష్టించి అందులో ఫొటోలు, అసభ్య వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నాడు. 12 ఫేస్బుక్ ఖాతాలు సృష్టించాడు. అలా ముగ్గురు యువతులను వేధిస్తున్నాడు. వారు ఫిర్యాదుచేయడంతో ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్, ఎస్సై ఆశిష్ రెడ్డి నిందితుడిని అరెస్టు చేశారు.
బాధిత యువతులు అతనితో పాటు ఇంటర్ చదువిన విద్యార్థులు కూడా ఉన్నారు. దాదాపు నెల రోజుల క్రితం ఓ బాధితురాలు.. తన పేరిట ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ కావడం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాటిని డియాక్టివేట్ చేయాలని కోరారు.
వాటిని డియాక్టివేట్ చేసినా.. సాయి శంతన్ మరో మూడు క్రియేట్ చేసి, ఆమెను వేధించాడు. పోలీసులు అతనికి చెందిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఫేక్ అకౌంట్ల ద్వారా ఫ్రెండ్స్కు రిక్వేస్టులు పంపించినట్లు పోలీసులు గుర్తించారు.