పని ఒత్తిడితో టెక్కీ ఆత్మహత్య, ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
హైదరాబాద్: పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజారం అనే టెక్కీ ఒత్తిడిని భరించలేక అనంతగిరి పర్యాటక శాఖ హరితా రిసార్టులో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదు మాదాపూర్కు చెందిన ఓ సాఫ్టువేర్ కంపెనీలో అతను పని చేస్తున్నాడు.
కొంతకాలంగా అతను డిప్రెషన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం అనంతగిరికి వెళ్లిన రాజారం రిసార్డులో దిగాడు. రూంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతను తన ఉన్నతాధికారికి మెయిల్ పంపినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బాలికపై అఘాయిత్యం
గిరిజన బాలికపై తండ్రీకొడుకు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. బషీరాబాద్ మండలానికి చెందిన మహిళ వివిధ ఇళ్లలో పనులు చేస్తూ జీవిస్తోంది.
భర్త మరణించడంతో పదిహేడేళ్ల కూతురుతో కలిసి దొరికిన చోట్లలో పని చేస్తోంది. గత ఏడాది కాశప్ప అనే వ్యక్తి కల్లు దుకాణంతో పాటు ఇంట్లో పని చేసేందుకు తల్లీకూతుళ్లను పనిలో కుదుర్చుకున్నాడు. కూతురుతో కలిసి అతని ఇంట్లో పని చేస్తోంది.
పెళ్లి చేసుకుంటానని బాలికను ఆ వ్యక్తి కొడుకు అశోక్ లొంగదీసుకొని అత్యాచారానికి పాల్పడ్డారు. అశోక్తో పెళ్లి చేయించాలని సదరు వ్యక్తిని తల్లీకూతుర్లు కోరారు. దీంతో అశోక్ను కొంతకాలం వేరే ఊరికి పంపించాడు తండ్రి. అశోక్ వెళ్లిపోయాక బాలికపై అతను పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అశోక్ తిరిగి వచ్చాక బాలికపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. బాలికలో శారీరక మార్పులను గ్రహించి తల్లి నిలదీయడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. బాలిక ఏడు నెలల గర్భిణి. గర్భం దాల్చిన విషయాన్ని తండ్రీ కొడుకులకు వివరించి గిరిజన మహిళ నిలదీసింది.
అశోక్తో పెళ్లి చేయించాలని కోరగా తండ్రీకొడుకులు నిరాకరించడంతో మంగళవారం బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాశప్ప, అశోక్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. జైలుకు తరలించారు.
ప్రియుడితో కలిసి భర్త హత్య
ఎల్బీ నగర్ ప్రాంతంలో వెంకటేష్ అనే వ్యక్తి కొంతకాలం హత్యకు గురయ్యాడు. ప్రియుడితో కలిసి భార్యే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించనున్నారు.