వీణా-వాణీల అప్పగింత అంశం?: తల్లి సంతకం లేని లేఖతో నీలోఫర్కు తండ్రి
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణీలు తల్లిదండ్రులు తీసుకెళ్లే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. వీణా-వాణిలను ఇప్పటికిప్పుడు తీసుకెళ్లలేమని తండ్రి మురళి తేల్చి చెప్పారు. ప్రభుత్వం సాయం చేస్తే వీణా-వాణిలను ఇక్కడ నుంచి తీసుకెళ్లలేమని లేఖలో పేర్కొన్నారు.
పిల్లల్ని తీసుకెళ్లే విషయమై వీణా-వాణీ తల్లిదండ్రులకు ఇచ్చిన సమయం గత గురువారంతోనే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే మరో ఐదు రోజుల గడువు కావాలని కోరిన తండ్రి మురళీ మంగళవారం ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా మురళీ ఒక లేఖను రాసుకొచ్చారు.
వీణా-వాణీల దారెటు?: ఇంటికా లేక ప్రభుత్వ సంరక్షణలోకా?
ఆ లేఖలో ప్రభుత్వం సాయం చేస్తే తప్ప తమ పిల్లలను ఇక్కడ నుంచి తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు. దీంతో పాటు వీణా-వాణీలను చూసుకునేందుకు తమ ఆర్ధిక పరిస్థితి సరిపోదని, గత 13 సంవత్సరాలుగా తమ స్వస్థలం నుంచి హైదరాబాద్కు వచ్చేందుకే అప్పులు చేయాల్సి వచ్చిందని అందులో పేర్కొన్నారు.
హైదరాబాద్లో ఇల్లు కట్టించి ఇవ్వడంతో పాటు తమకు ఉపాధి కల్పించాలని వీణా-వాణీల తండ్రి మురళీ లేఖలో పేర్కొన్నారు. తమ పిల్లల చదువు కోసం ప్రభుత్వమే ఒక టీచర్ను నియమించాలని అందులో పేర్కొన్నారు. అయితే లేఖలో తల్లి సంతకం లేకపోవడంతో నీలోఫర్ అధికారులు వీణా-వాణిలపై అప్పగించే విషయమై తిరస్కరించారు.
దీంతో తల్లి సంతకం చేయించి తీసుకొస్తానని చెప్పి తిరిగి వరంగల్ వెళ్లిపోయాడు. మరోవైపు వీణా-వాణీలపై ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటే వారిని తల్లిదండ్రులకు అప్పగించడమా లేక స్త్రీ శిశు సంక్షేమ శాఖకు అప్పగించే విషయమై నీలోఫర్ వైద్యులు ఆలోచనలో చేస్తున్నారు.
ఇందుకోసం ప్రభుత్వం అనుమతి కోరుతూ లేఖ రాయనున్నట్లు ఆసుపత్రి సూపరిటెండెంట్ తెలిపారు. కాగా ప్రస్తుతం వీణా-వాణీల వయసు 13 సంవత్సరాలు. గత తొమ్మిది సంవత్సరాలుగా వీరు నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉంటున్నారు. చిన్న పిల్లలకు చికిత్సను అందించే నీలోఫర్ ఆసుపత్రిలో వీరిద్దరిని ఉంచడం ఈ అవిభక్త కవలలకు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.