తెలంగాణ కేబినెట్ విస్తరణ..!! కడియం - ప్రకాశ్-కవితకు ఛాన్స్ : ఆ ఇద్దరిలో ఒకరు మండలి ఛైర్మన్ గా..!!
తెలంగాణలో రాజకీయంగా - పాలనా పరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా.. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఖాయమనే ప్రచారం పార్టీలో మొదలైంది. తాజాగా, ఎమ్మెల్సీల నియామకం పూర్తి కావటం...నామినేటెడ్ పోస్టుల ప్రకటనతో ఇక, మంత్రివర్గ విస్తరణ పైన సీఎం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా.. ప్రధానంగా బీసీ-ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ కొత్త వ్యూహాలు
ఇప్పటికే శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా.. అధికార టీఆర్ఎస్ కు మద్దతిచ్చే ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో కలిపి టీఆర్ఎస్ సంఖ్యా బలం 36 కు చేరింది. గవర్నర్ కోటాలో ఒకరు, ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు, స్థానిక సంస్థల కోటాలో 12 మంది కలుపుకొని మొత్తం 19 మంది టీఆర్ఎస్ సభ్యులు ఇటీవలి కాలంలో మండలికి ఎన్నికయ్యారు. కొత్తగా ఎమ్మెల్సీలుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో పలువురు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వీటితో పాటుగా.. మండలిలో చైర్మన్, వైస్ చైర్మన్తోపాటు చీఫ్ విప్, మరో మూడు విప్ పదవులు ఖాళీగా ఉన్నాయి.
మంత్రివర్గ విస్తరణపై ప్రచారం
వీటితోపాటు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న సభ్యులూ ఉన్నారు. మండలి చైర్మన్గా పనిచేసిన గుత్తా సుఖేందర్రెడ్డి మరోమారు మండలికి ఎన్నిక కాగా, గతంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన సిరికొండ మధుసూదనాచారి కూడా గవర్నర్ కోటాలో మండలిలో అడుగు పెడుతున్నారు. ఏడాదిన్నర కాలం చైర్మన్గా పనిచేసిన గుత్తా మరోమారు చైర్మన్గా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో సామాజిక సమీకరణాల్లో భాగంగా.. మాజీ స్పీకర్ మధుసూధనాచారి పేరు సైతం మండలి ఛైర్మన్ రేసులో ఉంది. మధుసూదనాచారికి చైర్మన్ పదవి దక్కితే గుత్తాకు ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత ఉన్న పదవి దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కేబినెట్ లో ఛాన్స్ దక్కేదెవరికి
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో మండలిలో అడుగుపెడుతున్న బండా ప్రకాశ్ ముదిరాజ్కు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. ఒకవేళ సామాజిక సమీకరణాల లెక్కల్లో కేబినెట్లో బెర్త్ దక్కకపోతే మండలి వైస్చైర్మన్గా ఎన్నికయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, ప్రస్తుత కేబినెట్ లో మండలి నుంచి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ మంత్రులుగా ఉన్నారు. ఇక, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కాగా ప్రాంతీయ- సామాజిక సమీకరణాలను అమలు చేయటం ఖాయంగా కనిపిస్తోంది.
ఆ మూడు పేర్లు ప్రధానంగా ప్రచారంలో
అందులో భాగంగా.. గతంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్ స్థానంలో చెందిన బండా ప్రకాశ్కు చోటు దక్కటం ఖాయమనేది పార్టీ వర్గాల అంచనా. ఇక, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్రెడ్డి, కల్వకుంట్ల కవిత ఆశావహుల జాబితాలో ఉన్నారు. మండలిలో ఖాళీగా ఉన్న మూడు విప్ పదవులను ఆశిస్తున్న వారిలో ఇప్పటికే విప్లుగా ఉన్న భానుప్రసాద్రావు, కూచుకుళ్ల దామోదర్రెడ్డితోపాటు తక్కల్లపల్లి రవీందర్రావు, సురభి వాణీదేవి, ఫారూఖ్ హుస్సేన్, గంగాధర్గౌడ్ ఉన్నారు.
Recommended Video
బడ్జెట్ సమావేశాలకు ముందే విస్తరణ ఉంటుందా
బీజేపీ - కాంగ్రెస్ విమర్శలను రాజకీయంగా - పాలనా పరంగా ధీటుగా తిప్పి కొట్టే వారికి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. అందులో భాగంగా బండా ప్రకాశ్...కడియం శ్రీహరి.. కవిత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందుగా కేబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. ఇక, మండలి ప్రొటెమ్ ఛైర్మన్ పదవీకాలం జనవరి 4న ముగుస్తుండటంతో కొత్త చైర్మన్ ఎన్నిక కోసం రెండు రోజులు మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని పైన ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత రానుంది.